Warangal News:  ప్రాణాలు పోయాల్సిన వైద్యులు..  పరిహాసంతో ఓ రోగికి చుక్కలు చూపిస్తున్నారు. వరంగల్‌ కేఎంసీ వైద్యులు రోగికి సేవలదించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు బాధితుడు దామెర అశోక్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బాధితుడి కథనం ప్రకారం.. అశోక్‌ భార్య జయకు నెల రోజుల క్రితం కడుపులో నొప్పి రావడంతో ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అయితే ఆమెకు కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కేఎంసీలోని ఎంజీఎం ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేస్తామని అడ్మిట్‌ చేసుకున్నారు. దాదాపు నెల రోజులుగా వేచి చూస్తున్న వారికి శుక్రవారం ఆపరేషన్‌ చేస్తామని వైద్యులు చెప్పగా... అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం బ్లడ్‌ రిజర్వ్‌ చేసి ఉంచాలని ఎంజీఎం బ్లడ్‌బ్యాంకుకు సమాచారం ఇచ్చారు. అయితే, గురువారం రాత్రే.. బ్లడ్‌ బ్యాంకు నిర్వాహకులు అశోక్‌కు బ్లడ్‌ అందించారు. అది కేఎంసీలోని డాక్టర్లకు చూపించగా, ఇప్పుడు అవసరం లేదంటూ తిప్పి పంపారు. అయితే బ్లడ్‌ బ్యాంకులో ఆ రక్తం తీసుకోవడానికి నిరాకరించారు. ఈలోగా ఓ సెక్యూరిటీ గార్డు అశోక్‌ భార్య కేస్‌ షీటు తీసుకుని మాయమయ్యాడు.


"ఆమెకు కిడ్నీలో స్టోన్స్ వచ్చినయ్. నెలపైనే అయితుంది జాయిన్ చేసి. ఆపరేషన్ ఇప్పుడు చేస్తం, అప్పుడు చేస్తం అనుకుంట జరుపుతూ వచ్చిర్రు. చివరకు శుక్రవారం చేస్తమని చెప్పిర్రు. గురువారం బ్లడ్ తెచ్చుకోమని సెక్యూరిటీ గార్డును ఇచ్చి పంపిచ్చిర్రు. బ్లడ్ తీస్కున్న తర్వాత సెక్యూరిటీ గార్డు.. కేస్ షీట్ తీస్కొని మాయం అయిండు. ఎటు వెళ్లిండో కూడా తెల్వది. ఇదే విషయం వైద్యులకు చెప్తే.. మేము ఆపరేషన్ చేయం. నువ్వేమన్న చేస్కో అంటున్నరు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తా అంటే వాళ్లేం ఆపరేషన్ చేయరంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నరు." - దామెర అశోక్‌


ఐదు నెలల క్రితం కడుపులో దూది ఉంచి కుట్లు వేసిన వైద్యులు..


వైద్యుల నిర్లక్ష్యం ఓ బాలింత ప్రాణం మీదకు తెచ్చింది. నల్కొండ సెంట్రల్ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. జ్యోతి అనే మహిళ డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు ఆపరేషన్ చేసి డెలవరీ చేశారు. డెలవరీ అనంతరం దూదిని డాక్టర్లు కడుపులోనే ఉంచి కుట్లు వేసేశారు. దూది కడుపులో ఉండిపోవడంతో బాధిత మహిళ మూడు రోజులపాటు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతోంది. ఈ విషయంపై బాధిత మహిళ బంధువులు ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులను అడగగా, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని మహిళ బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బాధ్యులపై చర్యల తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 


వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి! 


ఉమ్మడి నల్గొండ జిల్లాలో వట్టి ఖమ్మం పహాడ్ గ్రామానికి చెందిన పద్మ(55) అనే మహిళ అనారోగ్యంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయింది. వైద్యులు సరిగ్గాచూడకపోవడం వల్ల పద్మ పరిస్థితి   మరింత విషమించి మృతి చెందిందని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ అంబులెన్స్ లో స్వగ్రామానికి పద్మ మృతదేహాన్ని తరలిద్దామని అనుకుంటే, అంబులెన్స్ రిపేర్ లో ఉందని తెలిపారు. పద్మ కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు కూడా లేకపోవడంతో దాతల సహాయంతో చివరకు ప్రైవేట్ అంబులెన్స్ లో మృతదేహాన్ని తరలించారు. దీంతో మహిళా బంధువులు ప్రభుత్వాసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు సరిగ్గా చూసుకోకపోవడం వల్లే పద్మ పరిస్థితి విషమించిందని ఆరోపిస్తున్నారు. చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు.