Warangal CP AV Ranganath: వాహనదారులు లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే సదరు వాహనాన్ని సీజ్ చేస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ వాహన దారులను హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నియంత్రణతో పాటు క్రమశిక్షణతో కూడిన ట్రాఫిక్ ను కొనసాగించేందుకు సీపీ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ నెల 17వ తేది తర్వాత వాహనదారులు తమ వాహనాల నడిపేందుకు అవసరమయిన డ్రైవింగ్ లైసెన్సులను తప్పక కలిగి ఉండాలని సూచించారు. వాహనదారులు ఏవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపితే వారి వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడంతో పాటు వాహన యజమానిపై మోటార్ వెహికిల్ యాక్ట్ 180 మరియు 181 సెక్షన్ల కింద కేసులు పెడతామన్నారు. అలాగే కోర్టుకు తరలించి చార్జ్ షీట్ సమర్పిస్తామని వివరించారు. 


లైసెన్స్ లేని వాహనదారులు నూతనంగా రవాణా శాఖ నుండి పొందిన లర్నింగ్ లైసెన్స్ పత్రాలను పోలీస్ అధికారులకు సమర్పించిన తర్వాతే సీజ్ చేసిన వాహనాలను తిరిగి ఇస్తామన్నారు. అలాగే మైనర్లు వాహనాలు నడిపితే వారి వాహనాలు కూడా సీజ్ చేసి, తల్లిదండ్రులకు లేదా వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామని సీపీ ఏవీ రంగనాధ్ వివరించారు. అంతే కాకుండావాహనాలు నడిపిన మైనర్ల తల్లిదండ్రులకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో కౌన్సిలింగ్ ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ప్రజలు తమ వంతు సాయాన్ని అందించాలని సీపీ కోరారు. 


అలాగే అనవరస ఛలాన్లు విధించడం తగ్గిస్తూనే ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే జరిమానాలు విధించాలని సీపీ ఎవీ రంగనాథ్ అధికారులకు సూచించారు. కేవలం ద్విచక్ర వాహన దారులపై దృష్టి సారించకుండా కార్లతో పాటు ఇతర వాహనాలపై ట్రాఫిక్ అధికారులు దృష్టి పెట్టాలని, త్వరలో స్టాప్ లైన్లు మరియు జీబ్రా లైన్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. వచ్చే ఏడాది అంటే జనవరి మొదటి తేదీ నుండి స్టాప్ లైన్లు దాటి ముందుకు వస్తే జరిమానాలు విధించాలని సూచించారు.  అలాగే ప్రతి కూడళ్లలోనూ ఫ్రీ లెప్ట్ ఏర్పాటు చేయాలని, ఫ్రీ టెస్ట్ నిబంధనను అతిక్రమిస్తే జరిమానా తప్పదని వివరించారు. ముఖ్యంగా అధికారులు సమస్యను అధ్యయనం చేసి పరిష్కార మార్గాన్ని వెతకాలని సీపీ రంగనాథ్ వివరించారు. అంతే కాకుండా జంక్షన్లల్లో ఆటోలు నిలిపి వేయకుండా తగు చర్యలు తీసుకోవడంతో పాటు ఆటో డ్రైవర్ల అడ్డాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.


వాహన పార్కింగ్ కోసం ప్రధాన రోడ్డు మార్గాల్లో మార్జిన్ లైన్లను గీయించి.. మార్జిన్ లైన్లలో మాత్రమే వాహనాలు పార్కింగ్ చేసే విధంగా తగు ప్రచారం చేయాలని వివరించారు. అలాగే బ్యాంకులు, వైన్ షాపులు, బార్ల ముందుగా వాహనాల క్రమబద్ధీకరణ చేసేందుకుగా సంబంధిత యాజమాన్యం ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని ఏర్పాటు చేసుకోనే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో ట్రాఫిక్ ఇంజినీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేసి ఇన్ స్పెక్టర్ అధికారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై విశ్లేషణ చేస్తారని, త్వరలో హైదరాబాద్ తరహలోనే అపరేషన్ రోప్ నిర్వహింబడుతుందని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు సజావుగా కొనసాగేందుకు.. ప్రమాదకరమైన రీతిలో అనుమతించని ప్రదేశాల్లో నిలిపిన వాహనాలను తరలించడం, మోటరు వాహనాలు, చిరు వ్యాపారులు, వ్యాపార సంస్థలు రహదారుల ఆక్రమణను నిరోధించడమే ఆపరేషన్ రోప్ ప్రధాన ఉద్యేశమని పోలీస్ కమిషనర్ తెలిపారు.