Vikarabad Girl Death: వికారాబాద్ జిల్లాలో జరిగిన మైనర్ బాలిక అత్యాచారం, హత్య కేసులో మిస్టరీ వీడింది. ముందుగా అనుకున్నట్లే ఆమె ప్రియుడే బాలికపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు తేల్చారు. ఈ కేసుకు సంబంధించి వికారాబాద్ ఎస్పీ బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.


పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికను ఒక వ్యక్తే హత్య (Vikarabad Girl Murder) చేసినట్లుగా వికారాబాద్ ఎస్పీ వెల్లడించారు. మహేందర్ (నాని) అనే వ్యక్తికి బాలికకు ఏడాది నుంచి బాగా పరిచయం ఉందని, వారి ఇళ్లు కూడా పక్కపక్కనే ఉంటాయని తెలిపారు. ఇద్దరి మధ్య ప్రేమ కూడా ఉన్నట్లు చెప్పారు. ఆ విషయం ఇంట్లో తెలవడంతో ఇంట్లో తిట్టారని అన్నారు. ఈ క్రమంలోనే వారిద్దరూ గొడవ పడ్డారని చెప్పారు. హత్యకు ముందు కూడా ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకొని బయట కలవాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. నిర్మానుష్య ప్రాంతంలో వారిద్దరూ కలుసుకున్న సమయంలో నిందితుడు తన కోరిక తీర్చుకొనేందుకు బలవంతం చేశాడని ఎస్పీ తెలిపారు.


‘‘బాలిక తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో నిందితుడు మహేందర్ బాలికను నెట్టివేయడంతో ఆమె చెట్టుకు తగిలి నుదుటిన పెద్ద దెబ్బతగిలింది. కింద పడిపోయిన యువతిపై నిందితుడు బలవంతంగా తన కామ వాంఛ తీర్చుకున్నాడు. ఆ తర్వాత బాలిక చనిపోయింది. పోలీసుల విచారణ, డాక్టర్ల అభిప్రాయాలు, క్లూస్ టీమ్, ఎఫ్ఎస్ఎల్ నివేదిక అన్ని పరిగణలోకి తీసుకున్న అనంతరం మేం ఈ నిర్ధారణకు వచ్చాం. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నాం. అన్ని ఆధారాలు సేకరించుకొని సాయంత్రానికి కోర్టులో ప్రవేశపెడతాం.’’ అని ఎస్పీ తెలిపారు.


ఎంతో మంది ఆడపిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు చెప్పేది వినకుండా మోసపోతున్నారని ఎస్పీ తెలిపారు. యువకులు పెట్టే ప్రలోభాలకు లోనవుతున్నారని.. వారు పిలవగానే బయటకు పోవొద్దని ఎస్పీ సూచించారు.


తల్లే నిందితురాలని తొలుత అనుమానం


బాలిక హత్య కేసు విచారణలో భాగంగా పోలీసులకు హతురాలి తల్లిపైన కూడా అనుమానం వచ్చింది. కేసు విచారణలో ఆమెను ప్రశ్నించిన పోలీసులు ఆవిడ చెబుతున్న సమాధానాలకు పొంతన లేకపోవడంతో ఆమె నిందితురాలని అనుమానించారు. దీంతో మీడియాలో కూడా రకరకాల కథనాలు వచ్చాయి. కానీ, బాధితురాలు చెబుతున్న పొంతన లేని సమాధానాలు ఉద్దేశపూర్వకంగా కాదని పోలీసులు తర్వాత నిర్ధారించుకున్నారు. అనంతరం డాక్టర్ల అభిప్రాయాలు, క్లూస్ టీమ్, ఎఫ్ఎస్ఎల్ నివేదిక, పోస్టు మార్టం రిపోర్టు లాంటివి అన్నీ పరిగణలోకి తీసుకొని నిందితుడు మహేందరే హత్య చేసినట్లుగా ధ్రువీకరించారు.