GO 317 Issue in Telangana: హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవో ద్వారా ఇబ్బందులు ఎదుర్కుంటున్న బాధితులు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodara Raja Narasimha)ని కలిశారు.  హైదరాబాదులోని ఆయన నివాసానికి ఆదివారం వెళ్లిన 317 జీవో బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా 317 జీవో బాధితులు మంత్రి దామోదర్ రాజనర్సింహకి తమ సమస్యల పరిష్కారం కోసం ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. 


ఉద్యోగుల స్థానికతను గుర్తించలేదన్న బాధితులు 
గత ప్రభుత్వం (BRS Government) అసంబద్ధ నిర్ణయాలతో ఉద్యోగుల స్థానికతను గుర్తించకుండా, జోనల్ వ్యవస్థను తీసుకొచ్చి తమ జీవితాలతో చెలగాటం అడుకున్నారని మంత్రికి వివరించారు. గత ప్రభుత్వం నిరంకుశ పాలన, అస్తవ్యస్త విధానాలతో ఉద్యోగులను, కుటుంబాలను అనేక ఇబ్బందులకు గురిచేశారని మంత్రి రాజనర్సింహకి బాధితులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 317 జీవో పై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహని కలిసిన బాధితులు.. తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 


ప్రత్యేక చొరవ తీసుకోవాలని మంత్రికి వినతి పత్రం 
317 జీవో బాధితులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి మంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవాలని వినతి పత్రాన్ని సమర్పించారు. తమకు న్యాయం చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. తమ స్థానికత, పదోన్నతులు, బదిలీలు, స్పౌజ్ కేసుల సమస్యల పరిష్కారానికి క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకోవాలని కోరారు. బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతుగా చర్చిస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ వారికి భరోసానిచ్చారు. 


ఉద్యోగులు, 317 జీవో బాధితులు చేసిన విజ్ఞప్తిపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు. క్యాబినెట్ సబ్ కమిటీ లో అధ్యయనం చేసి న్యాయం చేస్తామన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వం లో పునర్ సమీక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులకు, అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తుందన్నారు.