Vemula Prashanth Reddy: రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్ మెంట్ మార్పుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూ దందాలకు తెరతీస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. రైతుల నుంచి అక్రమంగా భూములు లాక్కుంటూ అరాచకాలకు పాల్పడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై సీబీఐ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "రీజినల్ రింగ్ రోడ్ దక్షిణభాగం అలైన్ మెంట్ మార్పుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూదందాలకు తెరలేపుతోంది. కేంద్ర నిధులతో చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కేసీఆర్ ఒప్పించారు. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం అలైన్ మెంట్ ఆమోదం పొందింది.  ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేదు. దక్షిణ భాగం అలైన్ మెంట్ కూడా గతంలోనే ఖరారు చేశారు. ఆమోదముద్ర పొందాల్సి ఉంది. స్వలాభం ఉందా లేదా అని కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది నెలల్లో చూసుకొంది. స్వలాభం కోసం రీజినల్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మారుస్తూ పేదల భూముల్లో నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దక్షిణ భాగం భూసేకరణ, రోడ్డు కోసం రాష్ట్రం రూ.2500 కోట్లు, కేంద్రం రూ.12,500 కోట్లు ఖర్చు పెట్టాలి. కాంగ్రెస్ నేతల భూములు ఉన్న వైపు అలైన్ మెంట్ మారుస్తున్నారు. సాగర్ రోడ్ లో గొల్లపల్లి గ్రామం నుంచి కర్మపల్లి  గ్రామానికి 2కి.మి, శ్రీశైలం రోడ్డులో కాటన్ మిల్ నుండి అమన్ గల్ దాటి దాదాపు నాలుగు కిలోమీటర్లు దూరానికి మార్చారు’’ అని అన్నారు.


ఫోర్త్ సిటీకి దూరం 
ఫోర్త్ సిటీ సౌలభ్యం కోసం అలైన్ మెంట్ మారుస్తున్నామంటూ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఫోర్త్ సిటీ,  పాత అలైన్ మెంట్ మధ్య దూరం 10 కిలో మీటర్లు ఉంటే కొత్త అలైన్ మెంట్ మధ్య దూరం 12 కిలో మీటర్లు అయిందన్నారు.  అలైన్ మెంట్ మార్పుతో ఫోర్ట్ సిటీకి దూరమైందన్నారు. అమన్ గల్ వద్ద 400 ఎకరాల కుందారం భూములను పేదలు సాగు చేసుకుంటున్నారు. రాజ వంశీయులతో బేరం చేసుకొని పేదలను వెల్లగొట్టి కాంగ్రెస్ నేతలు భూములు ఆక్రమిస్తున్నారు. అక్కడ బిగ్ బ్రదర్స్  పేర్లు చెబుతున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు.జనవరి నుంచే పేద రైతుల నుంచి కబ్జా రద్దు ఒప్పందాలు చేసుకుంటూ భూములు లాక్కుంటున్నారు. కబ్జా రద్దు ఒప్పందం మొదటిసారి చూస్తున్నామన్నారు.  అలైన్ మెంట్ మాటి కాంగ్రెస్ ఎమ్మెల్యే గ్రామం మీదుగా ఎలా వెళ్తోంది? మాడుగుల గ్రామం సీఎం బంధువులది, అక్కడ ఏం జరుగుతోంది? చేవెళ్ల మార్గంలో అంగడి చిట్టెంపల్లి నుంచి ఐదు కిలోమీటర్లు జరిగి మన్నెగూడ క్రాస్ రోడ్స్ కు మార్చారని ఎమ్మెల్యే అన్నారు.


భూములు సేకరించిన బిగ్ బ్రదర్స్
మన్నె గూడ సమీపంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, కాంగ్రెస్ నేతల భూములు ఉన్నాయని ప్రజలు చెప్తున్నారు. బిగ్ బ్రదర్స్ భూములు సేకరించి పెట్టుకున్నారని అంటున్నారు. ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగంలో నాలుగు చోట్ల అలైన్ మెంట్ మార్చడం వెనకాల మతలబు ఏమిటి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల భూములు ఉన్న వైపు అలైన్ మెంట్ మారుస్తున్నారు. ఇందులో బిగ్ బ్రదర్స్  హస్తం  ఉంది. మాడుగుల గ్రామం లో సీఎం బంధువుల భూములు ఉన్నాయి. ఎందుకోసం అలైన్ మెంట్ మారుస్తున్నారో స్పష్టంగా అర్థం అవుతోంది. అలైన్ మెంట్ మార్పు పై శ్వేత పత్రం విడుదల చేయాలి. మొదటి అలైన్ మెంట్ తో ఎలాంటి గొడవ లేదు. ఇప్పుడు అందరూ ఇబ్బంది పడుతున్నారు. అలైన్ మెంట్ మారుస్తూ పోతే కేంద్రం ప్రాజెక్టు టేకప్ చేయకపోవచ్చు కూడా అని ప్రశాంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.


అప్పుల భారం వేసే ప్రయత్నం
కేంద్రం చేయకపోయినా సరే రోడ్డు మా భూముల గుండా పోవాల్సిందే అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తెలంగాణ పై 12500 కోట్ల అప్పుల భారం వేసి, ప్రజల్ని అప్పుల ఊబిలోకి నెట్టైనా సరే ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టాలని భావిస్తున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. కుట్రగేట్ అనే ప్రాంతంలో ఆఫీస్ ఏర్పాటు చేసుకొని మరి ఈ భూములు లాక్కునే  కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పాత అలైన్ మెంట్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా జోక్యం చేసుకొని పేదలు, గిరిజనుల బాధలు అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం మార్చాలని అనుకుంటే పూర్తి పారదర్శకంగా, పేదలకు మంచి పరిహారం ఇచ్చి చేయాలని డిమాండ్ చేశారు.  అలైన్ మెంట్ మార్పు వ్యవహారంపై సీబీఐ విచారణ కోరాలన్నారు. సీబీఐ విచారణ చేయకపోతే కాంగ్రెస్, భాజపా ఒక్కటే అని భావించాల్సి వస్తుందని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.