తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారతారని ప్రచారం జరుగుతుండడంతో ఆయన స్పష్టత ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన భార్య ఉత్తమ్ పద్మావతి కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళుతున్నారని రూమర్లు వెల్లువెత్తాయి. అన్ని చర్చలు జరిగాయని, జూపల్లి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌ లోకి చేరిన రోజే, బీఆర్ఎస్ పార్టీలోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వస్తారని విశ్లేషణలు చేస్తున్నారు.


ఈ క్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. తాను పార్టీ మారబోవడం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలు అబద్ధాలని చెప్పుకొచ్చారు. పార్టీ వీడుతున్నట్లు తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారాలు చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial