పవిత్ర పుణ్యక్షేత్రం భద్రగిరి రాములోరి సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు రానున్నారు. 28న ఉదయం 7:20 గంటలకు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయం నుంచి బయల్దేరుతారు. 7:40 గంటలకు హకీంపేటలోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేడియానికి చేరుకుంటారు. 7:50 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి 8:50 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 9 గంటలకు బయల్దేరి 9:50 గంటలకు భద్రాచలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు వస్తారు. 10 గంటలకు హెలిప్యాడ్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా 10:10 గంటలకు భద్రాచలం చేరుకుంటారు.


10:15 గంటల నుంచి 10:30 గంటల వరకు ఆలయాన్ని సందర్శించి, ప్రసాద్‌ స్కీం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. 10:30 గంటలకు స్వామివారిని దర్శించుకుంటారు. 10:45 గంటల నుంచి 11:30 గంటల వరకు సమ్మక్క సారలమ్మ జంజతి పూజారి సమ్మేళనంలో పాల్గొంటారు. అనంతరం వర్చువల్‌ విధానంలో కుమురంభీం ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఉన్న ఏకలవ్య పాఠశాలలను ప్రారంభిస్తారు. 


అనంతరం ఐటీసీ అతిథి గృహానికి చేరుకుంటారు. 11:40 నుంచి మధ్యాహ్నం 1:15 గంటల వరకు లంచ్‌ బ్రేక్‌ ఉంటుంది. 1:15 గంటలకు 1:25 గంటలకు భద్రాచలం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 1:35 గంటలకు హెలికాప్టర్‌లో వెళ్తారు. అలాగే రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఆమెతో పాటు ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 9 గంటలకు భద్రాచలం చేరుకుంటారు. అక్కడి నుంచి ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయానికి చేరుకుంటారు. రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని, ప్రసాద్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కాగా, ఈ నెల 30న యాదాద్రికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఈ పర్యటన సజావుగా సాగేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


నేడు బీజేపీ సమావేశాలు. రెండు రోజుల పాటు విస్తారక్‌లకు శిక్షణ తరగతులు


లోక్ సభ ప్రవాసీ యోజనలో భాగంగా ఇవాళ, రేపు బీజేపీ రెండు రోజులపాటు విస్తారక్ల శిక్షణ తరగతులు నగర శివారులోని ఓ రిసార్ట్ లో జరగనున్నాయి. ఈ శిక్షణా తరగతులకు పలు రాష్ట్రాల్లోని, కేంద్రపాలిత ప్రాంతాల్లోని లోక్ సభ నియోజకవర్గాల విస్తారక్లు హాజరౌతారు. ఈ శిక్షణా తరగతులకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్, వినోద్ తావ్డే, తరుణ్ చుగ్‌ పాల్గొంటారు. సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఈ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శుల సమావేశంతో పాటు, చేరికల కమిటీ సమావేశం కూడా జరగనుంది. 


కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు


భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు గాంధీ భవన్ లో ఉదయం 10 గంటలకు జరుగుతుంది. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎంపీ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాల్గొంటారు.  


నేటి నుంచి రైతుబంధు.. 70.54 లక్షల మందికి పెట్టుబడి సాయం


పదో విడత రైతుబంధు సంబురం మొదలైంది. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు నిధులను నేటి ఉదయం నుంచే రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది. తొలిరోజు ఎకరంలోపు రైతులకు అందజేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. అర్హులైన చివరి రైతు వరకు రైతుబంధు పంపిణీ చేస్తామని వెల్లడించారు.


ఈ సీజన్‌లో 70.54 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుబంధు సాయం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.7,676.61 కోట్లు సిద్ధం చేసినట్టు వివరించారు. ఈ సీజన్‌లో 1.53 కోట్ల ఎకరాలకు రైతుబంధు ఇవ్వనున్నట్టు తెలిపారు. గత తొమ్మిది విడతల్లో కలిపి మొత్తం రూ.57,882 కోట్లు రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేశామని, ప్రస్తుతం పంపిణీ చేయనున్న పదో విడతతో కలిపితే ఈ మొత్తం రూ.65,559.28 కోట్లకు చేరుతుందని చెప్పారు.


పదో విడత రైతుబంధు పంపిణీ ఇలా..
లబ్ధిపొందనున్న రైతులు 70.54 లక్షల మంది
మొత్తం విస్తీర్ణం 1.53 కోట్ల ఎకరాలు
పంపిణీ చేయనున్న మొత్తం రూ.7,676.61 కోట్లు
9 విడతల్లో పంపిణీ చేసిన మొత్తం రూ.57,882 కోట్లు
ఈ సీజన్‌తో కలిపితే మొత్తం రూ.65,559.28 కోట్లు


సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త.. టీఎస్‌ఆర్టీసీలో 10శాతం రాయితీ


సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్‌ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్‌ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, రాజధాని, గరుడ ప్లస్‌ బస్సుల్లో అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ బుకింగ్‌కు ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఈ రాయితీ అమల్లో ఉం టుందని స్పష్టం చేసింది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10శాతం రాయితీ కల్పించాలని నిర్ణయించినట్లు సంస్థ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ సజ్జన్నార్‌ తెలిపారు. ఈ రాయితీ సదుపాయాన్ని ప్రజలంతా ఉపయోగించుకోవాలనీ, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. రిజర్వేషన్‌ కోసం ఆర్టీసీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు.