Union Minister Bandi Sanjay News | హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుర్చీ కాపాడేందుకు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డితో దోస్తానా ఉంటే మీ ప్రభుత్వం పడిపోయే ప్రమాదముందని ఎవరైనా మీడియాతో మాట్లాడతారా? ఎవరితోనైనా ఫ్రెండ్ షిప్ ఉంటే  ఫోన్ లో మాట్లాడుకుంటారు కానీ మీడియాతో మాట్లాడరు అన్నారు. కేసీఆర్ కు, కాంగ్రెస్ పెద్దలతో దోస్తానా ఉంది కాబట్టే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసుల్లో అరెస్ట్ కాకుండా తప్పించుకునేందుకే చీకట్లో ఢిల్లీకి పోయారన్నారు. కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని డబ్బు సంచులు ఇచ్చి వచ్చింది వాస్తవం కాదా? అని కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు.


బీఆర్ఎస్ నేతలపై నమోదైన కేసులు విచారణకు రాకుండా ఢిల్లీ పెద్దల మందు సాగిలపడ్డది నిజం కాదా?’’ అంటూ బండి సంజయ్ మాజీ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిని కాపాడేందుకు బండి సంజయ్ తాపత్రయపడుతున్నారు అనే కేటీఆర్ ట్వీట్ కు అదే స్థాయిలో బదులిచ్చారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన బండి సంజయ్ మీడియా కేటీఆర్ చేసిన ట్వీట్ ను ప్రస్తావించగా తీవ్రంగా స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. 


ఓటుకు నోటు కేసు ఎందుకు నీరుగార్చారు..


బీఆర్ఎస్ నేతల్ని ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ.. మీరు పదేళ్లు అధికారంలో ఉన్నారు. ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసు ఉన్నది. ఆ కేసు ఎందుకు తేల్చలేకపోయారు? ఆ కేసును ఎందుకు మీరు నీరుగార్చారు? రేవంత్ తో దోస్తానా ఉన్నది బీఆర్ఎస్ కా ? బీజేపీకా ?. కేటీఆర్ అహంకారంవల్లే బీఆర్ఎస్ కి  రాష్ట్రంలో ఈ గతి పట్టింది. అయినా అహంకారం తగ్గలే. అందుకే బీఆర్ఎస్ (BRS Party) గ్రాఫ్ పెరిగే పరిస్తితి కనిపిస్తలేదు. బాధ భరించలేకే కేసీఆర్ ఫాంహౌజ్ కే పరిమితమై పండుకున్నడు. కేటీఆర్ వల్ల బీఆర్ఎస్ పూర్తిగా సర్వనాశననం అవుతుంది.


ఏదో ఒక పేపర్ చూసి కేటీఆర్ వాగడం కాదు. నిరుద్యోగులను లాఠీఛార్జ్ చేయించింది కేసీఆరే కదా... రైతులు, మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయ, విద్యార్థి వర్గాలను మీరు లాఠీలతో కొట్టించారు. ముందు ఈ విషయాలకు సమాధానం చెప్పు? అయ్యప్ప సొసైటీ విషయంలో పైసలు దండుకుంది మీరు కాదా? బీజేపీ నేతల గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదు.


మూసీలో మేం ఎందుకు ఉండాలి


మూసీ నది ప్రాంతంలో స్టే చేయడానికి మాకేం పనిలేదా? అని బండి సంజ్ మండిపడ్డారు.  కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏమయ్యాయి? ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ (KCR) పేరుంది. మాజీ సీఎం కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని అరెస్టైన వారు వాంగ్మూలం ఇచ్చారు. అయినా కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? వాళ్లకు దమ్ముంటే కేసు సీబీఐకి అప్పగించాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్య మధ్య లాలూచీ లేకుండా సీబీఐకి కేసు అప్పగించాలి. ఒకవేళ కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలకు డబ్బుల మూటలు ఇవ్వలేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులను సీబీఐకి అప్పగించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.


Also Read: Bandi Sanjay Protest: గ్రూప్ 1 వివాదంపై రోడ్డుపై బైఠాయించి బండి సంజయ్ నిరసన, ఛలో సెక్రటేరియట్‌కు పిలుపు