Bandi Sanjay meeets Group 1 aspirants at Ashok Nagar | హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. హైకోర్టుకు వెళ్లినా వారికి నిరాశే ఎదురైంది. గ్రూప్ 1 అభ్యర్థుల కష్టాలకు తెలంగాణ ప్రభుత్వమే కారణమని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ బాధితులు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులను ఆశ్రయించి తమకు న్యాయం జరిగేలా చేయాలని కోరారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ను గ్రూప్ 1 బాధితులు కలిశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన గ్రూప్ 1 అభ్యర్థులు కేంద్ర మంత్రి బండి సంజయ్ ను కలిసి, తమకు న్యాయం చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 29 ఉత్వర్వులతో తీవ్రంగా నష్టపోతున్నామని అభ్యర్థులు వాపోయారు.


రోడ్డెక్కి నిరసన, ఛలో సెక్రటేరియట్ కు పిలుపు
గ్రూప్ 1 అభ్యర్థులను  కలిసేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ అశోక్ నగర్ కు వెళ్లారు. కేంద్ర మంత్రిని అయినా నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం రోడ్డెక్కి నిరసన తెలిపారు. గ్రూప్స్ అభ్యర్థుల పరిస్కారం కోసం బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు. అభ్యర్థులతో కలిసి బండి సంజయ్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఛలో సెక్రటేరియట్ కు బండి సంజయ్ పిలుపునిచ్చారు. గ్రూప్ 1 వాయిదా వేయాలని, జీవో 29 వెనక్కి తీసుకుని తమ సమస్యలు పరిష్కరించేందుకు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. దాంతో గ్రూప్ అభ్యర్థులు వేలాదిగా సెక్రటేరియట్ వైపు కదులుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే హైదరాబాద్ లో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉందని అటు పోలీసులు, ఇటు ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.


అంతకు ముందు గ్రూప్ 1 అభ్యర్థుల పోరాటానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ మద్దతు తెలిపారు. తాము హాస్టళ్లలో చదువుకుంటున్నా కూడా బయటకు లాక్కొచ్చి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలం అని కూడా చూడకుండా హాస్టల్ లోకి చొరబడి బట్టలు చింపేస్తున్నారని మహిళా అభ్యర్థులు కేంద్ర మంత్రికి చెప్పుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ఏమైనా ప్రశ్నిస్తే తమపై నక్సలైట్స్ అని, లేక ఏవైనా ముద్ర వేస్తారని చెప్పారు. రాముడి వనవాసం మాదిరిగా గ్రూప్ 1 పరీక్షల కోసం 12 ఏళ్లపాటు ఎదురు చూడాల్సి వచ్చిందని అభ్యర్థులు బండి సంజయ్ కి తమ సమస్యలు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. 






తెలుగు అకాడమీ సిలబస్ చదవాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని అభ్యర్థులు వాపోయారు. మీడియా నుంచి తమకు సహకారం అందడం  లేదని అభ్యర్థులు ఆరోపించారు. తమకు ఎవరూ న్యాయం చేయడం లేదని, మీరు న్యాయం చేయాలంటూ బండి సంజయ్ ని గ్రూప్ 1 అభ్యర్థులు కోరారు. నిరుగ్యోగులు, అభ్యర్థుల వినతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మీ పక్షాన బీజేపీ నేతలు పోరాడుతారని భరోసా ఇచ్చారు. ప్రశాంతంగా చదువుకోవాలని, న్యాయం జరిగేవరకు పోరాడతామని హామీ ఇచ్చారు. కాగా, షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 21న గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ మొదలవుతాయి.


Also Read: Telangana Group One: షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 1 పరీక్షలు - హైకోర్టు డివిజన్ బెంచ్‌లోనూ ప్రభుత్వానికే అనుకూల తీర్పు