UAPA Case On Haragopal: పౌర హక్కుల నేత, ప్రొఫెసర్‌ హరగోపాల్ పై పెట్టిన UAPA కేసు ఎత్తివేశారు. హరగోపాల్ తో పాటు మరో ఆరుగురిపై పెట్టిన ఉపా కేసులను ఎత్తివేసింది తెలంగాణ ప్రభుత్వం. వీరిపై ఉపా కేసులు ఎత్తివేసినట్లు ములుగు ఎస్పీ కీలక ప్రకటన చేశారు. పద్మజాషా, అడ్వకేట్ రఘునాథ్, గడ్డం లక్ష్మణ్, గుంటి రవీంద్రలపై ఉపా కేసులు ఎత్తివేసినట్లు వెల్లడించారు. 


అంతకుముందు ప్రొఫెసర్‌ హరగోపాల్ సహా ఇతరులపై పెట్టిన UAPA కేసులు ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌కు ఆదేశాలు ఇచ్చారు. డీజీపీ ఆదేశాలతో పోలీసులు వీరిపై నమోదు చేసిన ఉపా కేసులు ఎత్తివేశారు. ఈ విషయాన్ని ములుగు ఎస్పీ శనివారం రాత్రి వెల్లడించారు.


పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశద్రోహం కేసు నమోదు తెలంగాణలో సంచలనంగా మారింది. ఉపా చట్టం (Unlawful Activities (Prevention) Act) 2022 కింద గత ఏడాది ఆగస్టులో 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది. ఇదే కాక ఆయుధాల చట్టం, సెక్షన్ 10 కింద కేసులు నమోదు అయ్యాయి. హరగోపాల్‌తో పాటు 152 మంది ఉద్యమకారులు, మేధావులు ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా ఉన్నారు.


అభియోగాలు ఇవీ.. 
ప్రొఫెసర్ హరగోపాల్ మావోయిస్టులకు సహయసహకారాలు అందిస్తున్నారని, బీరెల్లి కుట్రలో ఆయన భాగం అయ్యారని, పైగా నిషేధిత మావోయిస్టుల పుస్తకాల్లో ఆయన పేరు ఉందనే అభియోగాలు నమోదు అయ్యాయి. ఇంకా మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఆయుధాల ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం, ప్రభుత్వాన్ని కూలదోయడం, పార్టీకి నిధులు సమకూర్చుకోవడం, అమాయక యువకులను మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్‌ చేసుకోవడం వంటి పనులు చేసినట్లు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. నిందితులుగా ఉన్న వారిలో ప్రొఫెసర్‌ హరగోపాల్‌, ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌, ముంబై హైకోర్టు జడ్జిగా పనిచేసిన సురేశ్‌ (జస్టిస్‌ సురేశ్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యేనాటికే చనిపోయారు) ప్రొఫెసర్‌ పద్మజా షా, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది వీ రఘునాథ్‌, చిక్కుడు ప్రభాకర్‌ తదితరుల పేర్లు ఉన్నాయి.


ఉపా కేసులపై ప్రొఫెసర్ ఏమన్నారంటే..
రాజద్రోహం, దేశద్రోహం లాంటి కేసులు పెట్టవద్దని సుప్రీం కోర్టు గతంలోనే తీర్పు ఇచ్చిందన్నారు. కనుక ప్రభుత్వం పెట్టిన ఈ కేసు నిలబడదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. మావోయిస్టులకు తమ మద్దతు ఎందుకు ఉంటుందని, వాళ్లు తమ లాంటి వాళ్ల మీద ఆధారపడరని అన్నారు. అసలు వాళ్ల ఉద్యమం వేరు అని అన్నారు. 152 మందిపైనా ఏదో ఒక కేసు పెట్టడం విషాద పరిణామం అని అన్నారు. బాధ్యతరాహిత్యంగా కేసులు పెడుతున్నారని చెప్పారు. నిజాయితీపరులపైనా.. ఆఖరికి చనిపోయిన వారిపై కూడా కేసులు పెట్టారని కీలక వ్యాఖ్యలు చేశారు. 


ప్రొఫెసర్‌ హరగోపాల్‌, పద్మజాషా లాంటి వారిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌ ఎం. రాఘవాచారి ఇటీవల డిమాండ్‌ చేశారు. మరోవైపు విద్యా మేధావులను ఇరికించడం వెనుక కుట్ర ఉందని, కేసు వివరాలను బహిర్గత పర్చాలని విద్యా సంఘాలు డిమాండ్‌ చేయడం తెలిసిందే.