హైదరాబాద్: సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. ఆ ప్రయాణికుల సౌకర్యార్థం లహరి ఏసీ స్లీపర్‌, ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సుల్లో బెర్త్‌ల టికెట్లపై 10 శాతం రాయితీ కల్పించాలని TSRTC యాజమాన్యం నిర్ణయించింది. సాధారణ టికెట్‌ ధరలో ప్రయాణికులు బుక్‌ చేసుకునే బెర్త్‌లపై 10 శాతం డిస్కౌంట్‌ను కల్పించింది. లహరి ఏసీ స్లీపర్‌, ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సులు తిరిగే అన్ని రూట్లలోనూ ఈ రాయితీ వర్తిస్తుంది. ఏప్రిల్‌ 30 వరకు డిస్కౌంట్‌ అమల్లో ఉంటుందని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ ఓ ప్రకటనలో తెలిపారు. 




లహరి ఏసీ స్లీపర్ బస్సులు హైదరాబద్ నుంచి చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు రూట్లలో సేవలు అందిస్తున్నాయి. లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ సర్వీసులు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ కు, గోదావరిఖని- బెంగళూరు, కరీంనగర్- బెంగళూరు, నిజామాబాద్ -తిరుపతి, నిజామాబాద్ -బెంగళూరు, వరంగల్-బెంగళూరు రూట్లలో తిరుగుతున్నాయి. ఈ రూట్లలో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు 10 శాతం రాయితీని వినియోగించుకుని, టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ ఎండీ సజ్జనార్ ప్రజలను కోరారు.


శీతాకాలం ముగిసి ఎండాకాలం వచ్చేసింది. వచ్చే నెలలో పరీక్షలు పూర్తైన తర్వాత విద్యార్థులకు వేసవి సెలవులు రానున్నాయి. విద్యార్థులకు హాలిడేస్ వస్తున్నాయంటే కుటుంబసభ్యులు విహారయాత్రకు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. వేసవి సెలవులు ఎక్కువ రోజులు ఉంటాయి కనుక ఈ కాలంలో తల్లిదండ్రులు తన పిల్లలతో కలిసి టూర్స్‌కు వెళుతూ ఉంటారు. ప్రముఖ దేవాలయాలతో పాటు అందమైన ప్రదేశాలకు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఎక్కువమంది తమ ఫ్యామిలీతో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీశైలానికి వెళుతూ ఉంటారు. అలాంటి వారికి టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ తెలిపింది. నగరం నుంచి శ్రీశైలంకు ఇప్పటివరకు నాన్ ఏసీ బస్సులను మాత్రమే టీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది. కానీ ఏపీ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.


శ్రీశైలానికి ఏసీ బస్సులు.. 
హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు 85 కొత్త బస్సులను టీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. వీటిలో 10 ప్రత్యేక ఏసీ బస్సులు కూడా ఉన్నాయి. ఇటీవల ఈ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. ఎండాకాలంలో చల్లని వాతావరణంలో శ్రీశైలంకు వెళ్లాలనుకునే భక్తులకు ఏసీ బస్సులు ఉపశమనం కలిగించనున్నాయి. ఇప్పటివరకు ఏసీ బస్సులు లేకపోవడంతో చాలామంది హైదరాబాద్ నుంచి సొంత కార్లు, అద్దె కార్లలో వెళ్తున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు రోజూ 30 సూపర్ లగ్జరీ బస్సు సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. కానీ ఏసీ బస్సులు లేకపోవడంతో ఎండాకాలంలో సదూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారికి ఇబ్బంది పడుతున్నారు. ఉక్కబోత, ఎండ వేడికి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని ప్రయాణికులు సౌకర్యార్థం ఏసీ బస్సులు తీసుకురావడంతో శ్రీశైలం వెళ్లేవారు చల్లగా ప్రయాణం చేయవచ్చు.


మరోవైపు రాజధాని ఏసీ బస్సుల పొడవు ఎక్కువగా ఉండటంతో ఘాట్ రోడ్లలో మలుపులు తిరగడం కష్టం. దీంతో శ్రీశైలంకు సూపర్ లగ్జరీ బస్సులను మాత్రమే టీఎస్‌ ఆర్టీసీ నడుపుతోంది. కానీ ఇప్పుడు సూపర్ లగ్జరీ బస్సుల తరహాలోనే రాజధాని బస్సులను తయారు చేయించారు. దీంతో ఘాట్ రోడ్లలో ప్రయాణానికి కూడా ఇవి సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ బస్సులతో శ్రీశైలంకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని, తర్వాత టీఎస్‌ఆర్టీసీకి కూడా లాభం జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లుగా టీఎస్‌ఆర్టీసీ కొత్త బస్సులను తీసుకొస్తుంది. పర్యాటక ప్రదేశాలకు బస్సుల సంఖ్యను పెంచుతుంది. ఆర్టీసీకి కూడా ఆదాయం వస్తుంది.