TS Minister Harish Rao About CPR:

  గత కొన్ని రోజులుగా కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో  గురువారం నాడు రెండు వేర్వేరు చోట్ల సీపీఆర్ చేసి ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసిన సీఐని, 108 సిబ్బందిని మంత్రి హరీష్ రావు అభినందించారు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడుతున్న రియల్ హీరోలకు అభినందనలు అని ట్వీట్ చేశారు. 


కుకునూర్ పల్లి మండలం, చిన్న కిష్టాపురానికి చెందిన రాజు అనే యువకుడి ప్రాణాలను 108 సిబ్బంది సీపీఆర్ చేసి కాపాడగా, హైదరాబాద్ హయత్ నగర్ లో కారు నడుపుతూ గుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్ చేసి రాచకొండ పరిధిలోని రామన్నపేట సీఐ మానవత్వం చాటుకున్నారు అని మంత్రి హరీష్ రావు వారిని అభినందించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఆర్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. సీపీఆర్ పై ప్రతి ఒక్కరికీ అవగాహన పెరిగితే ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు. #CPR అని మంత్రి హరీష్ రావు పోస్ట్ చేశారు.






అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ లోని మలక్ పేట్ కి చెందిన కావలి శ్రీనివాస్ (42), మంగమ్మ భార్యాభర్తలు. వీరికి సంతానం ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీనివాస్ తన కుటుంబంతో పాటు హయత్ నగర్ లో అద్దెకు నివాసం ఉంటున్నాడు. క్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు శ్రీనివాస్. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం  సమయంలో ఓ కుటుంబాన్ని యాదగిరిగుట్టకు తీసుకెళుతున్నాడు.  ఓఆర్ఆర్ ఎగ్జిట్ దాటిన తరువాత క్యాబ్ డ్రైవర్ శ్రీనివాస్ కు ఛాతీలో నొప్పి వచ్చింది. దాంతో క్యాబ్ లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 






సీఐ సీపీఆర్ చేసినా దక్కని ప్రాణాలు..!
క్యాబ్ లో ఉన్న ప్యాసింజర్ అప్రమత్తమై స్టీరింగ్ ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న రామన్నపేట సిఐ మోతీరాం కారు నెమ్మదిగా వెళ్లడం గమనించారు. కారును చేరుకుని గమనించగా.. వెనుక సీట్లో ఉన్న మహిళ స్టీరింగ్ కంట్రోల్ చేస్తోంది. అప్రమత్తమైన సీఐ మరో వ్యక్తి సహాయంతోఆ కారును నియంత్రించారు. వెంటనే కారులో నుంచి డ్రైవర్ శ్రీనివాస్ ను బయటకు తీశారు. సీఐ మోతీరాం సీపీఆర్ చేయగా శ్రీనివాస్ స్పృహలోకి వచ్చాడు. చికిత్స కోసం సీఐ తన వాహనంలోనే శ్రీనివాస్ ను హయత్ నగర్ లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. డ్రైవర్ ను పరిశీలించిన డాక్టర్లు అప్పటికే అతను మృతి చెందినట్లుగా నిర్ధారించినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమై సీపీఆర్ చేసినా ప్రాణాలు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 


ఒకరి ప్రాణం కాపాడిన 108 సిబ్బంది
కుకునూర్ పల్లి మండలం చిన్నకిష్టాపూర్ గ్రామానికి చెందిన పర్వతంరాజు డ్రైవర్ గా చేస్తున్నాడు. గురువారం చిన్నకిష్టపూర్ నుంచి కుకునూర్ పల్లికి వస్తుండగా ఆటో నడపుతున్న పర్వతంరాజుకు ఛాతీలో నొప్పి రావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇది గమనించిన ఓ వ్యక్తి 108 కి సమాచారం అందించాడు. కొండపాక 108 సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మెడికల్ టెక్నీషియన్ మహేందర్ ఆ వ్యక్తికి సీపీఆర్ చేయగా స్పృహలోకి వచ్చాడు. మెరుగైన వైద్యం కోసం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు కాపాడిన మెడికల్ టెక్నీషియన్ మహేందర్, పైలెట్ రమేష్ లను అందరూ అభినందించారు.