TRS MLAs Buying Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు లో బెయిల్ పిటీషన్లపై విచారణ ఉన్నందున వాయిదా వేయాలని ప్రతివాదులు కోరారు. ఈ క్రమంలో బెయిల్ పిటీషన్ల విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు బెయిల్ కు సంబంధించి తీర్పు ఇస్తుందని నిందితుల భావించగా.. విచారణను వారం రోజుల తర్వాతకు వాయిదా వేయడంతో నిందితులు షాకయ్యారు. మరి హైకోర్టు నిందితుల బెయిల్ పై ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాల్సిందే. 


ఇక ఫాం హౌస్ డీల్ కేసుకు సంబంధించి మరో ఇద్దరు శరత్, ప్రశాంత్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో వీరిద్దరూ కీలకం కానున్నట్లు తెలుస్తోంది. శరత్, ప్రశాంత్ ను అదుపులోకి తీసుకొని అక్కడే పోలీసు కమిషనరేట్ లో తెలంగాణ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ళాగే కొచ్చిన్ కు చెందిన జగ్గూజి అనే మరో స్వామిజీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తుషార్ కు, జగ్గూజికి మధ్య సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై కూపీ లాగుతున్నారు. 


నందకుమార్ పై పీటీ వారెంట్.. అనుమతిస్తే అరెస్టే..!


రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల్లో ఒకరైన నంద కుమార్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదు అయ్యాయి. డెక్కన్ కిచెన్ యాజమాన్యంతో పాటు నంద వద్ద స్థలం లీజుకు తీసుకున్న మరో వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. 2021 జూన్ లో తమ ప్రాంగణాన్ని నంద కుమార్ వ్యాపారానికి వాడుకొమ్మన్నాడని తన సోదరులతో కలిసి 3 వేల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు అయాజ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థలం ఇచ్చినందుకు 12 లక్షల రూపాయల అడ్వాన్స్, నెలకు రెండు లక్షల అద్దె, లాభాల్లో 10 శాతం వాటా ఇస్తున్నట్లు చెప్పారు. 


అయితే నంద కుమార్ ఇచ్చిన స్థలం దగ్గుబాటి సురేష్, వెంకటేశ్ నుంచి ఆయన లీజుకు తీసుకున్నాడని తెలిసిందని అయాజ్ ఫిర్యాదులో వివరించాడు. అక్రమంగా లీజుకు ఇచ్చినట్లు గుర్తించి.. తమ డబ్బు తిరిగి ఇవ్వమంటే బెదిరింపులకు పాల్పడినట్లు వివరించారు. డెక్కన్ కిచెన్ సమీపంలో 700 చదరపు అడుగుల స్థలాన్ని లీజు వ్యవహారంలోనూ మరో ఫిర్యాదుతో నందకుమార్ పై రెండో కేసు నమోదైంది. హైదరాబాద్ లో గ్యాడ్జెట్ స్టూడియో పేరుతో చరవాణి పరికరాల వ్యాపారం చేస్తున్న సందీప్.. నెలకు లక్షన్నర అద్దె, 12 లక్షల అడ్వాన్స్ తో నందకుమార్ వద్ద స్థలం లీజుకు తీసుకున్నారు. 50 లక్షలతో వ్యాపారం కోసం స్థలాన్ని అభివృద్ధి చేసుకోగా.. తీరా అది దగ్గుబాటి కుటుంబ సభ్యులకు చెందిన స్థలంగా తెలిసిందని బాధితుడి వాపోయాడు. ఇద్దరి ఫిర్యాదుల మేరకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే నాంపల్లి కోర్టులో పోలీసులు పీటీ వారంట్ దాఖలు చేశారు. అరెస్టుకు న్యాయస్థానం అనుమతి కోరుతూ పీటీ వారంట్ దాఖల్ చేశారు. ఎమ్మెల్యే ఎర కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న నంద కుమార్ చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. నాంపల్లి కోర్టు అనుమతిస్తే పోలీసులు నంద కుమార్ ను అరెస్ట్ చేయనున్నారు.