నేడు బీఆర్ఎస్ లో చేరనున్న మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావేల కిషోర్ బాబు. 


ఆంధ్రప్రదేశ్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి ఇవాళ పలువురు నేతలు ఆపార్టీ అధ్యక్ష్యుడు కేసిఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.  వీరిలో మాజీ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ పార్థసారథితోపాటు మరికొంతమంది నేతలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరనున్నారు. 


బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడుగా తోట చంద్రశేఖర్ కే పగ్గాలు !


బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ ను నియమించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్యలో తెలంగాణ భవన్ లో ఏపీ నుంచి నేతలు, మాజీ అధికారులు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ పార్టీలో చేరునుండగా.. కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానం పలకనున్నారు. తోట చంద్రశేఖర్ గతంలో ప్రజారాజ్యం, వైఎస్ ఆర్ సీపీ నుంచి గుంటూరు, ఏలూరుల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జనసేనలో చేరి  2019లో గుంటూరు పశ్చిమ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రశేఖర్ ఓటమిచెందారు. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న చంద్రశేఖర్ తాజాగా బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఐఏఎస్ అధికారిగా అటు మహారాష్ట్రలోనూ, ఇటు ఏపీలో మంచి సంబంధాలు ఉండటం, ఏపీలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ రాకతో పార్టీలో కొత్త జోష్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఇక ఇవాళ పార్టీ లో చేరుతున్న మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాజీ ఐఆర్ఎస్ అధికారి. 2014లో టీడీపీ నుంచి పోటీచేసి గెలిచి చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి పదవి కూడా పొందారు. ఆ తర్వాత ఆయన జనసేన, దాని తర్వాత బీజేపీలో కూడా చేరారు. తాజాగా బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. రావెల కిషోర్ బాబు సేవలను ఢిల్లీ స్థాయిలో వినియోగించుకోవాలని కేసిఆర్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.ఢిల్లీలో పనిచేసిన రావెల కిషోర్ బాబుకు ఢిల్లీ స్థాయి అధికారులతో మంచి సత్సాసంబంధాలు ఉన్నాయి. 


నేడు కాంగ్రెస్ పార్టీ ధర్నాలు. రేవంత్ తో సహా పలువురు నేతలు హౌస్ అరెస్ట్ 


నేడు హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక వద్ద సర్పంచుల ధర్నా నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, రాజీవ్ పంచాయతీ రాజ్ సంఘటన్ ఛైర్మన్ సిద్ధేశ్వర్ తెలిపారు. సర్పంచులకు పంచాయతీలకు నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో నేడు ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఇప్పటికే పోలీసుల అనుమతి కోరుతూ కాంగ్రెస్ పార్టీ పక్షాన లేఖ ఇచ్చామన్నారు. ధర్నా చౌక్ వద్ద ధర్నాకు అనుమతి కోరామని, అసెంబ్లీ ముట్టడికో,  రాస్తారోకో కోసమో అనుమతి అడగలేదన్నారు. ధర్నా చౌక్ వద్ద అనుమతి ఇవ్వకపోయినా సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్పంచుల ధర్నా జరిగి తీరుతుందన్నారు. అయితే ఇందిరాపార్క్ వద్ద పోలీసులు కాంగ్రెస్ పార్టీ నేతలకు పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పటికే పలువురు నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు.