A-1 Bandi sanjay :  టెన్త్ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్ ను ఏ 1 గా చేర్చుతూ పోలీసులు రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. ఏ-2గా బూర ప్రశాంత్,  ఏ -3 గండబోయిన మహేష్  , ఏ - 5గా శివగణేష్‌లను చేర్చారు. ఏ -10 వరకూ పోగు సుభాష్, పోగు శశాంక్, శ్రీకాంత్, షర్మిక్, వర్షిత్ వంటి వారిని చేర్చారు. అయితే ఏ - 4 ఎవరన్నది మాత్రం రిమాండ్ రిపోర్టులో పేర్కొనలేదు. ఏ -4 నిందితుడు మైనర్ కావడంతో పోలీసులు పేరును రిమాండ్ రిపోర్టులో పేర్కొనలేదు. ఎస్సెస్సీ పరీక్షల ప్రశ్నాపత్రాలను లీక్ చేయాలని బండి సంజయ్ కుమార్..  ప్రశాంత్, మహేష్‌లతో కలిసి కుట్ర చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 



ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వంగా బద్నాం చేయాడనికి.. పేపర్ల లీక్ కుట్ర చేసినట్లుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పేపర్ లీక్ ఎలా చేయాలన్న అంశంపై ఏ -3 అయిన మహేష్‌తో బండి సంజయ్ వాట్సాప్‌లో చర్చించారని పోలీసులు తెలిపారు. కమలాపపూర్ టీచర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసినట్లుగా తెలిపారు. ఈ ఎఫ్‌ఐఆర్‌లో ఈటల రాజేందర్ పేరు కూడా ఉంది. క్వశ్చన్ పేపర్‌ను నిందితులు ఈటల రాజేందర్‌తో పాటు బండి సంజయ్‌కు కూడా పంపారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. దీనికి సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించామని తెలిపారు. 



బండి సంజయ్‌ను కోర్టులో ప్రవేశ పెట్టినప్పుడు  ఆయన వాహనంపై దాడి చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. పదో తరగతి పేపర్ల లీకేజీకి కుట్రదారుడిగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయన్ను హన్మకొండ జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఏప్రిల్ 5వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో పోలీస్ వాహనంలో ఆయన్ను కోర్టుకు తీసుకొస్తున్న సమయంలో.. వరంగల్ అధాలత్ సెంటర్ దగ్గర కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు.. బండి సంజయ్ వాహనంపై చెప్పులు, కోడి గుడ్లు విసిరారు. బండి సంజయ్ వెళుతున్న వాహనాన్ని టార్గెట్ చేసి మరీ.. చెప్పులు, కోడిగుడ్లు విసరటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆ ప్రాంతం నుంచి వాహనాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లారు పోలీసులు. 


కోర్టు దగ్గరకు వచ్చిన సమయంలోనూ బండి సంజయ్ ఉన్న పోలీస్ వాహనంపై చెప్పులు విసిరారు బీఆర్ఎస్ కార్యకర్తలు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అప్పటికే అక్కడ ఉన్న వందలాది మందిని చెల్లాచెదురు చేశారు. బండి సంజయ్ కు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు పోలీస్ వాహనాన్ని అడ్డగించారు. బండిని విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. పోలీస్ వాహనంపైకి ఎక్కి అడ్డుకున్నారు. పోలీసులు లాఠీఛార్జి చేసి అందర్నీ చెదరగొట్టారు. 
 
బండి సంజయ్ పై చెప్పులు, కోడిగుడ్లు విసిరినట్లు వార్తలు రావటంతో బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. హన్మకొండ కోర్టు ఎదుట నిరసనకు దిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో..  కోర్టు చుట్టుపక్కల భారీగా మోహరించిన పోలీసులు.. అక్కడి నుంచి అందర్నీ పంపించి వేశారు. కోర్టు చుట్టుపక్కలకు ఎవరూ లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు.