Mission Bhagiradha :   ఢిల్లీలో పొగుడుతున్నారు .. అవార్డులిస్తున్నారు కానీ గల్లీలోకి వచ్చి రాజకీయాల కోసం విమర్శలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అందుకు సాక్ష్యంగా మిషన్ భగీరథకు వచ్చిన అవార్డును చూపిస్తున్నారు. గాంధీ జయంతి రోజున తెలంగాణ వందశాతం ఇళ్లకు నల్లా నీరు ఇస్తున్నందుకు కేంద్రం అవార్డు ఇస్తోందని టీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు వంటి వారు ఈ అంశాన్ని పదే పదే చెబుతున్నారు. అయితే అవార్డు ఇచ్చింది మిషన్ భగీరధకు కాదని .. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ద్వారా అధికారికంగా ప్రకటన విడుదల చేయించారు 


కేంద్ర జలశక్తి శాఖ మిషన్‌ భగీరథకు జాతీయ అవార్డు ఇచ్చారనడాన్ని ఖండించింది.  మిషన్ భగీరథ పథకాన్ని కేంద్రం అసలు అంచనా వేయనేలేదని.. తెలంగాణలో 100% నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు కేంద్రం ధ్రువీకరించనేలేదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే 100 శాతం నల్లా నీటి కనెక్షన్లు ఇచ్చినట్లు  నివేదిక ఇచ్చిందని కానీ.. కేంద్రం ధృవీకరించలేదన్నారు.  జల్ జీవన్ మిషన్ నిబంధనల ప్రకారం 100 శాతం నల్లా కనెక్షన్లు ఉన్నట్లు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల ద్వారా  తీర్మానాలు చేయాలి. కానీ పంచాయతీల ద్వారా ఇప్పటి వరకు ధ్రువీకరించనేలేదని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. 


గ్రామీణ గృహాలకు నీటి సరఫరా విభాగంలో మాత్రమే  తెలంగాణకు అవార్డుకు ఎంపికైందని తన వివరణలో జలశక్తి శాఖ తెలిపింది.  ఫంక్షనాలిటీ అసెస్‌మెంట్ డేటా ప్రకారం తెలంగాణలోని 409 గ్రామాల్లోని మొత్తం 12,570 గృహాలలో శాంపిల్స్ పరీక్షించగా, 8% నివాసాలు ప్రతిరోజు 55 లీటర్ల తలసరి నీటి కంటే తక్కువ తాగునీరు పొందుతున్నాయి.అదేవిధంగా మొత్త నమూనాల్లో 5% నివాసాల్లో నీటి నాణ్యత JJM నిబంధనల ప్రకారం లేదని గుర్తించామని తెలిపింది. గ్రామీణ గృహాలకు నీటి సరఫరా విభాగంలో అక్టోబరు 2న తెలంగాణకు అవార్డును బహూకరిస్తున్నారు. అయితే నీటి సరఫరాలో క్రమబద్ధత అనేది మొత్తం కార్యాచరణ అంచనా కోసం స్వీకరించిన అనేక పారామీటర్స్‌లో ఒకటని స్పష్టం చేసింది. 


తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో ప్రాజెక్ట్ ప్రారంభించి ప్రతీ గ్రామానికి నల్లా నీరు ఇవ్వాలని సంకల్పించింది. దాదాపుగా తెలంగాణ మొత్తం పైప్ లైన్లు వేయించింది. ఆ తర్వాత కేంద్రం జల్ జీవన్ మిషన్ పేరుతో.. దేశంలోని ప్రతీ ఇంటికి నల్లా నీరు అందించే లక్ష్యంతో పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకాన్ని ఎప్పటి నుంచే అమలు చేస్తున్నందున.. తాము జల్ జీవన్ మిషన్ కింద లక్ష్యాన్ని పూర్తి చేశామని తెలంగాణ ప్రబుత్వం కేంద్రానికి నివేదిక సమర్పించింది. అయితే జల జీవన్ మిషన్ ప్రమాణాల ప్రకారం ఇంకా ఆ విషయాన్ని కేంద్రం నిర్ధారించలేదు. ఈ లోపు గ్రామీణ నీటి సరఫరా విషయంలో మాత్రమే అవార్డును ప్రకటించారు. దీంతో మొత్తం మిషన్ భగీరథకు అవార్డు వచ్చినట్లుగా టీఆర్ఎస్ మంత్రులు ప్రకటనలు చేయడంతో వివాదం ప్రారంభమయింది.