Telangana Inter 2nd Year Results 2025: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు వచ్చేశాయి. తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలు, విద్యార్థుల పాస్ శాతాలను ఆయన ప్రకటిస్తున్నారు.  ఇంటర్ విద్యార్థులు ఏబీపీ దేశం వెబ్‌సైట్‌లో, అధికారిక వెబ్‌సైట్‌తో ఫలితాలను చూసుకోవచ్చు. 

ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,97,017 మంది విద్యార్థులు హాజరయ్యారని భట్టి విక్రమార్క తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ లో 66.89 శాతం పాస్ కాగా, సెకండియర్ లో 71.37 శాతం  పాసయ్యారని వెల్లడించారు. రెండో సంవత్సరం 508582 మంది హాజరయ్యారు. 74.21 శాతం బాలికలు పాస్ కాగా, 57.31 శాతం బాలురు పాసయ్యారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

 

గత కొన్నేళ్లలో ఇంటర్‌ ఫలితాలు ఎప్పుడు విడుదలయ్యాయో పరిశీలిస్తే... 2024లో ఏప్రిల్‌ 24న, 2023లో మే 9న, 2022 జూన్ 28న, 2021లో జూన్ 28న ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదల చేశారు. ఇప్పుడు సైతం గతేడాది తరహాలోనే ఏప్రిల్‌లో ఫలితాలు విడుదల చేశారు. గత ఏడాది కంటే రెండు రోజులు ముందుగానే ఇంటర్ రిజల్ట్స్‌ విడుదలయ్యాయి. 

తెలంగాణలో మార్చి 5వ తేదీ నుంచి 25 వరకు ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ ఏడాది మొత్తం 9,96,971 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 4,44,697 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు పూర్తయిన నెలరోజుల్లోనే తెలంగాణ విద్యాశాఖ ఫలితాలను వెల్లడించింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో విడుదల చేసింది.  

ఇంటర్ ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలపై అప్పుడే అప్ డేట్ ఇచ్చారు. మే 22న అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం అవుతాయని భట్టి విక్రమార్క తెలిపారు. విద్యార్థులు జాగ్రత్తగా ప్రిపేర్ కావాలని సూచించారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జూన్ 3 నుంచి జూర్ 6 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 30 వరకు ఫీజులు చెల్లించడానికి అవకాశం కల్పించారు.