Second Fhase Loan Waiver :  తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్  తీపి కబురు చెప్పింది.  అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో   సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత రైతు రుణ మాఫీ నిధులు విడుదల  చేశారు. ఇప్పటికే రూ.లక్ష ఉన్నవారికి రుణమాఫీ పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 6,40,223 మందికి రూ.6190.01 కోట్లు నిధులు విడుదల చేశారు. మూడో విడత కింద 17, 75, 235 మంది రైతులకు రూ.12,224.98కోట్లు విడుదల చేశారు.


చిత్తశుద్ధితో రుణమాఫీ చేశాం : రేవంత్  


రాజకీయ ప్రయోజనం కాదు... రైతు ప్రయోజనం ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు సంతోషంగా ఉండాలని 6మే 2022న వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించామని..  గత ప్రభుత్వం  60నెలలు నాలుగు విడతల్లో రూ.లక్ష రుణమాఫీ కూడా పూర్తిచేయలేకపోయారని  గుర్తు చేశారు.  గత ప్రభుత్వం రూ.25వేల కోట్లు కూడా రుణమాఫీ చేయలేకపోయిందన్నారు.  అప్పుల్లో కూరుకుపోయిన తెలంగాణ ప్రభుత్వం ఎలా రుణమాఫీ చేస్తుందని కొందరు మాట్లాడారని..  ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ చేయాల్సిందేనని ప్రణాళికలు రచించాం.. నిధులు సేకరించామని తెలిపారు  నిధుల సమీకరణ చేసి ఇవాళ రెండో విడతలో రూ.6,198కోట్లు ఆరున్నర లక్షల మందికి మేలు జరిగేలా చేస్తున్నామని..  ఇది మా చిత్తశుద్ధి, ఇది మా నిబద్ధత అని ప్రకటించారు. 


తెలంగాణ రైతు రుణమాఫీ సరికొత్త రికార్డు 


నెహ్రూ ఆనాడు హరిత విప్లవం తీసుకు వచ్చారని..  జై జవాన్, జై కిసాన్ నినాదంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్లిందని రేవంత్ తెలిపారు. పేద రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందించేందుకు ఇందిరమ్మ బ్యాంకుల జాతీయకరణ చేశారని..  సోనియమ్మ నేతృత్వంలో ఆనాడు ఆహార భద్రత చట్టం తీసుకువచ్చారని తెలిపారు.  ఆనాడు రూ.72వేల కోట్లు రుణాలు మాఫీ చేసి దేశంలో రైతులను ఆదుకుంది కాంగ్రెస్ అని గుర్తు చేశారు.  అప్పుడు .. ఇప్పుడు ఎప్పుడూ కాంగ్రెస్ రైతు పక్షపాతేనన్నారు.  నెల తిరిగేలోగా 1.5లక్షల వరకు రైతు రుణమాఫీ చేసి మా చిత్తశుద్ధి నిరూపించుకున్నామని..  అగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ పూర్తి చేసి రైతులను రుణ విముక్తులను చేస్తామన్నారు.  జూలై, ఆగస్టు నెలలు చరిత్రలో లిఖించదగ్గ నెలలు.  దేశ చరిత్రలోనే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ రికార్డు సృష్టించిందన్నారు.  స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్దమొత్తంలో రైతు రుణమాఫీ చేయలేదని..  గత బీఆరెస్ ప్రభుత్వం చేసిన అప్పులకు ఈ ఆరునెలల్లో ఆర్ధిక మంత్రి  రూ.43 వేల కోట్లు వడ్డీ చెల్లించారని ఆరోపించారు.  12 రోజుల్లోనే రుణమాఫీకి 12వేల కోట్లు సేకరించిన ఆర్ధిక మంత్రి, వారి సిబ్బందిని అభినందిస్తున్నానన్నారు. 


అసెంబ్లీలోనే ప్రత్యేక కార్యక్రమం                      


అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున  రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసేందుకు అసెంబ్లీలోనే ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. రైతులు, పంట  పొలాలు, పంటలకు సంబంధించిన ఆంశాలతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేసిన సభా వేదికపై నుంచి కార్యక్రమం పూర్తి చేశారు.