Telangana Schools: తెలంగాణ రాష్ట్రంలో సర్కారు పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాలు అడుగు పెట్టకూడదని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకే ఏ విద్యార్థి సంఘాన్ని కూడా బడులకు అనుమతించ వద్దంటూ డీఈఓలకు పాఠశాల విద్య డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏదైనా పాఠశాలలోకి ఏ విద్యార్థి సంఘం నాయకుడైనా వచ్చినట్లు రుజవు అయితే దానికి ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లే పేర్కొన్నారు. ఒకవేళ విద్యార్థి సంఘం నేతలు స్కూలుకు వస్తే హెచ్ఎంకు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులతో పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థి సంఘాలను కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ కాన్ఫరెన్స్ జరిగినట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో విద్యా సంస్థలు కేంద్రంగా ఎలాంటి వ్యతిరేకత రాకుండా చూడాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకే పాఠశాల విద్య డైరెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు వివరిస్తున్నాయి. 


ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్స్, కేజీబీవీలకు ఈ నిబంధన వర్తిస్తుందని ఆమె తెలిపినట్లు డీఈఓలు స్పష్టం చేస్తున్నారు. స్వచ్చంధ సంస్థలు, పార్టీలు, వ్యక్తులు, విద్యా సంఘాలు ఎవరైనా సరే ముందుగా డీఈఓ అనుమతి తీసుకోవాలని ఆదేశాల్లో వెల్లడించారు. దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇది అప్రజాస్వామికం అని, విద్యార్థి సమస్యలపై నినదించే హక్కు తీసివేయడం సరికాదని అంటున్నారు. మరోవైపు విద్యార్థి సంఘాలను అడ్డుకోవడం చాలా కష్టం అని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. వారిని అడ్డుకోవడం ఎలా సాధ్యమవుతుందంటూ ప్రశ్నించారు. ఇప్పటికి ఇప్పుడు నిర్బంధం విధిస్తే వారి నుంచి ప్రతిఘటన వస్తుందని.. పోలీసులు జోక్యం చేసుకుంటే మరిన్ని సమస్యలు ఏర్పడతాయని చెప్పుకొచ్చారు. 


Also Read: ఉద్యోగంలో చేరిన మూడు రోజులకే యువతి రిజైన్- తప్పో ఒప్పో చెప్పాలంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్