హైదరాబాద్: తెలంగాణలో సంక్రాంతి సందర్భంగా బస్సు టికెట్ ధరలు భారీగా పెంచారని ప్రచారం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల నుంచి టిెకెట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి రాష్ట్ర ఆర్టీసీని ఏకిపారేస్తున్నారు. సజ్జనార్ సార్ ఈ టికెట్ ధరల పెంపు ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీనిపై టీజీ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక బస్సుల నిర్వహణపై కీలక ప్రకటన చేశారు.
ప్రధాన పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిపే స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరలను సవరించినట్లు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం మరోసారి స్పష్టం చేస్తోంది. తిరుగు ప్రయాణంలో ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఏమాత్రం లేనప్పటికీ.. 'రద్దీ ఉన్న రూట్లలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఖాళీ బస్సులను త్వరతగతిన సంస్థ వెనక్కి తెప్పిస్తుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వాటిని ఆయా రూట్లలో నడిపిస్తుంది.
ఈ నేపథ్యంలోనే స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరలను సవరించినట్లు 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం ఈ సంక్రాంతికి కేవలం 5 రోజులు పాటు టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ సవరించింది.
ప్రైవేట్ వాహనాల్లో ప్రమాదకర ప్రయాణం చేయొద్దని ప్రజలకు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సూచిస్తోంది. ఆర్టీసీ సిబ్బంది ఎంతో అనుభవజ్ఞులని, సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారు ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుతోంది.