Telangana Vision Document 2047: సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సహచర మంత్రులు ఏ వేదిక ఎక్కినా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ కోసం మాట్లాడుతున్నారు. క్యాబినెట్ మీటింగ్‌లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను తయారు చేయాలని, దాన్ని 2025 డిసెంబర్ 9వ తేదీన ఆవిష్కరించాలని తీర్మానించింది. ఈ విజన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కీలకమైందిగా కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది. అయితే, అసలు ఈ విజన్ లక్ష్యాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

"తెలంగాణ రైజింగ్ 2047" విజన్ అనేక కీలక లక్ష్యాలను సాధించాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. అందులో ప్రధానంగా ఐదు కీలక అంశాల్లో ఈ విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆ ఐదు అంశాలు ఏంటో తెలుసుకుందాం.

1. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గల రాష్ట్రంగా తెలంగాణ

తెలంగాణ రాష్ట్రాన్ని 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశ జీడీపీలో తెలంగాణ నుంచి పది శాతం అందేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. మధ్యకాలిక లక్ష్యంగా 2035 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఏం చేయాలన్న దానిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఓ రూట్ మ్యాప్‌ ఏర్పాటు చేసుకుంది.

2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ రూపొందాలంటే పెట్టుబడులను విశేషంగా ఆకర్షించాలని నిర్ణయించుకుంది. దేశంలో అత్యధిక పెట్టుబడులను ఆకర్షించే రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ఇందుకోసం ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, మాన్యుఫాక్చరింగ్, సినీ పరిశ్రమ, పర్యాటక, ఇంధన, రవాణా - లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

2. ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్

తెలంగాణకు గ్రోత్ ఇంజన్ అయిన హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (GCC) హబ్‌గా, AI-రెడీ డేటా సెంటర్లకు, లైఫ్ సైన్సెస్, తయారీ రంగాలకు గ్లోబల్ సెంటర్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇందుకోసం అవసరమైన రీతిలో హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున కల్పించాలని భావిస్తోంది. అంతేకాకుండా, హైదరాబాద్‌లో 'ఫ్యూచర్ సిటీ' నిర్మాణం చేయాలని ఇప్పటికే తీర్మానించుకుంది.

మూడు వేల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నారు. ఇందులో AI సిటీ, స్పోర్ట్స్ సిటీ, లైఫ్ సైన్సెస్, హెల్త్ సిటీ, ఫార్మా సిటీ వంటివి భాగంగా ఉంటాయి. ఇది ప్రపంచ స్థాయి నగరాలైన న్యూయార్క్, లండన్, టోక్యో నగరాలతో పోటీపడేలా, కాలుష్యరహిత, కార్బన్-జీరో నగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే సబర్మతి, నమామి గంగే ప్రాజెక్టుల తరహాలో మూసీ నదిని పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు.

అంతేకాకుండా, రవాణా అభివృద్ధి కోసం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్ -2 కు కేంద్రం నుంచి అనుమతులు, నిధులు పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. 201 కిలోమీటర్ల దక్షిణ రీజినల్ రింగ్ రోడ్డు చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు నిర్మించి హైదరాబాద్‌పై ట్రాఫిక్ ఒత్తిడి లేకుండా చేయడం కూడా ఇందులో భాగమే. ఆర్.ఆర్.ఆర్ లోపల చిన్నపాటి నూతన నగరాల నిర్మాణాలు చేపట్టాలని రేవంత్ సర్కార్ ఈ విజన్‌లో భాగంగా లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ నగరాన్ని మరింత అభివృద్ధి చేయడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించవచ్చని, తద్వారా తెలంగాణను 3 మిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.

3. తెలంగాణ మానవ వనరుల, నైపుణ్య అభివృద్ధి కేంద్రంగా మలచడం

తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో మరో కీలక లక్ష్యం మానవ వనరుల కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడం. యువతకు ప్రపంచ నైపుణ్యాలను అందించడం ద్వారా ఉపాధి అవకాశాలను మరింతగా మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. ఇందుకోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలను డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లుగా తీర్చిదిద్దడం, ఐటీఐలలో విద్యార్థులకు అధునాతన సాంకేతిక విద్యను అందించడం విజన్ 2047 లక్ష్యాలుగా నిర్దేశించుకుంది. ఇందులోనే మహిళా సాధికారిత సాధించడం మరో లక్ష్యం. స్వయం సహాయక బృందాల్లోని 66 లక్షల మంది మహిళలను ఆర్థికంగా పరిపుష్టి చేయాలని, ఈ లక్ష్యాన్ని 2028లోగా అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

4. ప్రజాసంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ

ఆర్థికాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధితోపాటు ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో ప్రపంచానికి తెలంగాణ దిక్సూచి కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని కూడా భాగం చేసింది. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు పకడ్బందీగా లబ్ధిదారులందరికీ అందేలా చూడటం, రైతు సంక్షేమం కోసం రైతు భరోసా, వరి ధాన్యానికి బోనస్, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని ఈ డాక్యుమెంట్‌లో ప్రతిపాదించనుంది.

అంతేకాకుండా, గృహ జ్యోతిపథకం ద్వారా 200 యూనిట్ల విద్యుత్‌ను 32 లక్షల కుటుంబాలకు అందిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 500రూ కే గ్యాస్ సిలిండర్ పంపిణీ వంటి పథకాలు లబ్ధిదారులందరికీ అందే ప్రణాళికలను ఈ విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆయా ప్రజా అవసరాలను గుర్తించి వారికి ప్రభుత్వం నుండి లబ్ధి కలగాలన్న లక్ష్యంతో ప్రజాసంక్షేమాన్ని తెలంగాణ రైజింగ్ 2047లో భాగం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

5. పారదర్శక పాలనలో మార్గదర్శిగా తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం పారదర్శక పాలన లో మార్గదర్శిగా నిలవాలన్న లక్ష్యాన్ని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌లో పొందుపరచాలని నిర్ణయించింది. సరైన పాలన అందించడం, ప్రతీ నిర్ణయం పారదర్శకంగా, ప్రజలకు జవాబుదారీతనంతో ఉండేలా లక్ష్యాలను నిర్దేశించుకోనుంది. ఇందుకోసం టీఎస్పీఎస్సీ, లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ వంటి సంస్థలను బలోపేతం చేయడం ఇందులో భాగంగా పెట్టుకుంది. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకుంది.

ఈ ఐదు అంశాలనే ఓ రోడ్ మ్యాప్‌గా తీసుకుని తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌ను రూపొందించవచ్చని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, హైదరాబాద్ నగర అభివృద్ధి, మానవ వనరులు- నైపుణ్యాభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన వంటి ఐదు అంశాలు కీలకమని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. ఐదు వేళ్లతో హస్తం ఎలా రూపొందుతుందో.. ఈ ఐదు అంశాలతో విజన్ డాక్యుమెంట్ సమగ్రంగా రూపుదిద్దుకుంటుందని చెబుతున్నారు.