MLC Kavitha on KCR: తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబరాలు జరుపుకుంటున్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం  ఏర్పడిన తర్వాత సింగరేణి కార్మికులకు ఇంక్రిమెంట్లతో పాటు చిరకాల వాంఛ అయిన డిపెండెంట్ ఉద్యోగాలను సైతం సాధించుకున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. డిపెండెంట్ ఉద్యోగాలు రాకుండా అనేక మంది వ్యక్తులు, శక్తులు ఎన్నో అడ్డంకులు సృష్టించారని గుర్తు చేశారు. కానీ వాటన్నిటిని ఎదుర్కొని సీఎం కేసీఆర్.. కార్మికుల మంచికోరే వ్యక్తిగా కారుణ్య నియామ ప్రక్రియ ద్వారా ప్రతి నెలా ఉద్యోగులను తీసుకుంటున్నారన్నారు. అలా ఇప్పటి వరకు దాదాపుగా 15 వేల వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. వారసత్వ ఉద్యోగాలు కేవలం పురుషులకే కాకుండా, కూతుర్లు, కోడళ్లకు కూడా అవకాశం ఇవ్వడం ద్వారా మహిళల పట్ల కేసీఆర్ కు ఉన్న గొప్ప మనసును తెలుస్తుందని అన్నారు. కారుణ్య ఉద్యోగం వద్దనుకున్న వారికి గతంలో ఇస్తున్న రూ.10 లక్షలు మాత్రమే ఇవ్వగా.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక రూ.25 లక్షలకు పెంచామని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. 


ఇంటికి పది లక్షల రూపాయల వరకు వడ్డీలేని రుణం


ఉద్యోగ విరమణ వయస్సును కూడా 61 సంవత్సరాలకు పెంచుకోవడం సంతోషకరం అని ఎమ్మెల్సీ కవిత వివరించారు. కార్మికులకు సౌకర్యవంతంగా పని చేయాలనే ఉద్దేశ్యంతో సింగరేణి క్వార్టర్స్ కు ఉచిత విద్యుత్ తో పాటు, ఏసీ ఏర్పాటు చేసుకునే సౌకర్యాలు కల్పించారని గుర్తు చేశారు. అలాగే ఇంటికి పది లక్షల రూపాయల వరకు వడ్డీలేని రుణాన్ని ఇవ్వడం, మహిళా కార్మికులకు రెండు సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్, దివ్యాంగులకు ఉద్యోగాలు, సింగరేణి ఏరియా ఆస్పత్రులలో తల్లిదండ్రులకు ఉచిత వైద్య సదుపాయాన్ని కల్పించడం చాలా గొప్ప విషయం అని వివరించారు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా వైద్య సదుపాయాలు అందించడం, సింగరేణి కార్మికుల పిల్లల ఐఐటీ,  ఐఐఎం లాంటి చదువులకు ఫీ రీయింబర్స్ మెంట్ ఇవ్వడం.. సీఎం కేసీఆర్ వల్లే సాధ్యం అయిందని వివరించారు. సింగరేణి కార్మికుల కోసం మెడికల్ కాలేజీ లాంటి అనేక గొప్ప కార్యక్రమాలు తెలంగాణ వచ్చాక సాధించుకున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.


అమ్మ లాంటి సింగరేణి సంస్థను కాపాడి, విస్తరించారు..!


బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజుతో పాటు, మరో రోజున వేతనంతో కూడిన అధికారిక సెలవును సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. ఇదంతా చూస్తుంటేనే సీఎం కేసీఆర్ కు అంబేద్కర్ పట్ల ఉన్న గొప్ప ప్రేమను తెలుస్తుందన్నారు. అమ్మ లాంటి సింగరేణి సంస్థను సీఎం కేసీఆర్ కాపాడి, విస్తరించి, ఇతర రాష్ట్రాలకు సైతం సోలార్, థర్మల్ పవర్ ప్లాంట్ లను అదనంగా పెట్టి వేలాది మందికి ఉద్యోగాలు ఇవ్వడం చాలా గొప్ప విషయమని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం రావడం వల్లనే, తెలంగాణ బిడ్డ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం వల్లనే సింగరేణి సంస్థను లాభాల బాట పట్టిందని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు.