It Raids On Ponguleti: తాను నామినేషన్ వేసే రోజున ఉద్దేశపూర్వకంగానే తనను భయపెట్టేందుకే తన ఇంటిపై ఐటీ, ఈడీ అధికారుల దాడులు చేస్తున్నారని మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasreddy) ఆరోపించారు. ఖమ్మం (Khammam), హైదరాబాద్ లోని నివాసాల్లో ఐటీ అధికారుల తనిఖీలపై ఆయన స్పందించారు. తనను విమర్శించిన వారిని ఇబ్బంది పెట్టడం సీఎం కేసీఆర్ (Cm Kcr) కు అలవాటేనని, బీఆర్ఎస్, బీజేపీ కలిసి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. బీజేపీలోకి రావాలని తనపై ఒత్తిడి చేశారని, కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగినందునే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. 


ఈసీకి ఫిర్యాదు


ఈ దాడులను తీవ్రంగా ఖండించిన పొంగులేటి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కుట్ర పూరితంగానే ఈ సోదాలు చేస్తున్నారని, తన నామినేషన్ అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని ఎన్నికల అధికారుల దృష్టికి తెచ్చారు. మరోవైపు, పొంగులేటిపై ఐటీ, ఈడీ దాడులను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు భట్టి, ఖండించారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల ఇళ్లపై ఎందుకు ఐటీ దాడులు జరగడం లేదని, ఇవి కక్ష పూరితంగా జరుగుతున్న దాడులేనని ఆరోపించారు. ఇలాంటి వాటికి కాంగ్రెస్ భయపడదని, పొంగులేటికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. అటు, ఎట్టి పరిస్థితుల్లోనూ గురువారం తాను నామినేషన్ వేసి తీరుతానని, లేకుంటే శాంతి భద్రతల సమస్య వచ్చే అవకాశం ఉందని పొంగులేటి చెప్పారు. 


ఉదయం నుంచే దాడులు


కాగా, గురువారం ఉదయం నుంచే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు , కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వేకువజామున 4 గంటలకు 8 వాహనాల్లో వచ్చిన అధికారులు మూకుమ్మడిగా ఇంట్లోకి ప్రవేశించి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంటితో పాటు ఆయనకు సంబంధం ఉన్న వివిధ కంపెనీల్లో సోదాలు చేస్తున్నారు. ఖమ్మంతో పాటు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పొంగులేటి కుమారుడి ఇంట్లోనూ ఈ ప్రక్రియ కొనసాగుతోంది. హైదరాబాద్‌ నందగిరిహిల్స్‌లోని జ్యోతి హిల్‌రిడ్జ్‌, రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం ఏకకాలంలో 30 చోట్ల ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. కాగా, తనపై ఐటీ దాడులు జరిగొచ్చని పొంగులేటి 2 రోజుల క్రితమే చెప్పారు. అందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. ఆయన ఇలా అన్న రెండు రోజుల్లోనే ఐటీ అధికారులు రైడ్స్ షురూ చేశారు. 


ఖమ్మంలో ఉద్రిక్తత


మరోవైపు, పొంగులేటి ఇంటిపై ఐటీ దాడులకు నిరసనగా ఆయన అనుచరులు, అభిమానులు ఖమ్మంలోని ఆయన నివాసం ఆందోళన చేపట్టారు. ఈ దాడులు రాజకీయ కుట్ర అని ఆరోపించారు. పొంగులేటి ఇంటి గేట్లు ఎక్కిన కార్యకర్తలు, ఇంటి లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఖమ్మంలో పొంగులేటి ఫ్లెక్సీలకు అనుచరులు పాలాభిషేకం కూడా నిర్వహించారు. 


 


Also Read: Warangal Today News: అరువు తెచ్చుకున్న అభ్యర్థులను పోటీకి దించారు, కాంగ్రెస్ పై మంత్రి ఎర్రబెల్లి సెటైర్లు