Revanth Reddy Tweet on Praja Darbar: తెలంగాణ సీఎంగా గురువారం పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అందులో ప్రధానమైనది 'ప్రజాదర్బార్' (Praja Darabar). ప్రగతి భవన్ పేరును 'జ్యోతిబాపూలే ప్రజా భవన్'గా (Praja Bhawan) మార్చి తమ సమస్యలను తెలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగానే ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యలు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం జ్యోతిబాపూలే ప్రజా భవన్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో 'ప్రజాదర్బార్' జరిగిన తీరుపై సీఎం ఆసక్తికర ట్వీట్ చేశారు.


'జనం కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ తొలి ప్రజా దర్బార్ సాగింది. జనం నుంచి ఎదిగి.. ఆ జనం గుండె చప్పుడు విని, వాళ్ల సేవకుడిగా సహాయం చేసే అవకాశం రావడానికి మించిన తృప్తి ఏముంటుంది.' అని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. దీంతో పాటు ప్రజాదర్బార్ లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తోన్న వీడియోను షేర్ చేశారు.






తొలి రోజు పోటెత్తిన జనం


తెలంగాణ ప్రజా భవన్(Jyotiraopule Prajabhavan)కు తొలి రోజు ఉదయం నుంచే జనం పోటెత్తారు. ఈ క్రమంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 'ప్రజా భవన్'లో మీకోసం గేట్లు తెరిచే ఉంటాయి. మీ అర్జీలతో రండి. నేను పరిష్కరిస్తాను' సీఎం రేవంత్ రెడ్డి పిలుపుతో జనం తరలివచ్చారు. ఆయనకు తమ సమస్యలు విన్నవించారు. ఎక్కువగా భూమికి సంబంధించిన సమస్యలే వచ్చినట్లుగా తెలుస్తోంది. కొందరు పింఛన్లు కావాలని, ఇంకొందరు రెవెన్యూ సమస్యలను సీఎంకు విన్నవించారు. కాగా, సీఎం ప్రజా దర్బార్ పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా సీఎంనే కలిసి అర్జీలు సమర్పించే అవకాశం రావడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు ఎన్టీఆర్, చంద్రబాబు ఇలా ప్రజాదర్బార్ నిర్వహించే వారని గుర్తు చేసుకున్నారు. 






ప్రతి శుక్రవారం 'ప్రజాదర్బార్'


ప్రజా భవన్ లో వారానికోసారి ప్రజా దర్బార్ నిర్వహించే అవకాశముంది. ప్రతి శుక్రవారం ప్రజల కోసం ప్రజా భవన్ తెరిచే ఉంటుంది. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వారి అర్జీలను స్వీకరిస్తారని తెలుస్తోంది. మిగతా రోజుల్లో అధికారులు వాటిని స్వీకరించి పరిష్కారం సూచించే అవకాశముంటుంది. రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో అందుబాటులో లేని రోజుల్లో సీఎస్, లేదా ఇతర అధికారులు ఈ కార్యక్రమాన్ని కొనసాగించే అవకాశముంది.


ఇదీ చూడండి: BRSLP Meeting : బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆరే - కాంగ్రెస్ సర్కార్ పై పోరాటానికి రెడీ !