Fire Accident in Nampally Today: హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పరిధిలో బజార్ ఘాట్ లో ఘోర అగ్ని ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 9 మంది మృతి చెందగా, మరికొందరు అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో 4 రోజుల పసికందు కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పుట్టిన 4 రోజులకే చిన్నారి మృత్యుఒడికి చేరడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 


మృతుల వివరాలివే


అగ్ని ప్రమాద ఘటనలో మహ్మద్ ఆజామ్ (54), మహ్మద్ హసీబుర్ రెహమాన్, రెహానా సుల్తానా (50), బీడీఎస్ డాక్టర్ తహూరా పర్హీన్ (38) , తాహూరా పర్హీన్ ఇద్దరు పిల్లలు తూభ (5), తరూభా (12), ఫైజా సమీన్ (26), జకీర్ హుస్సేన్, నిక్కత్ సుల్తానా మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. బీడీఎస్ డాక్టర్ తహూరా పర్హీన్ ఈ బిల్డింగ్ లో నివాసం ఉండరని, సెలవులు ఉండడంతో పిల్లలను తీసుకుని బంధువుల ఇంటికి వచ్చారని పేర్కొన్నారు. మృతుల్లో 1, 2 ఫ్లోర్లలో ఉన్న వారే ఎక్కువగా ఉన్నారు. ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా, 21 మంది దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారని వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 3, 4 ఫ్లోర్లలో ఉన్న వారిని నిచ్చెనల సాయంతో కిందకు తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల సాయం ప్రకటించింది. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ అనంతరం నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రమాదంలో ఆస్తి నష్టం సంభవించిన వారికి సైతం ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.



తల్లీబిడ్డను కాపాడిన రెస్క్యూ టీం


ఈ ప్రమాద ఘటనలో మంటలు ఒక్కసారిగా చుట్టుముట్టగా అపార్ట్ మెంట్ లోని వారు, చుట్టుపక్కల భవనాల్లోని వారు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. మంటల్లో ఓ చిన్నారితో పాటు మహిళ చిక్కుకున్నారు. వీరిని అగ్ని మాపక సిబ్బంది అత్యంత ధైర్య సాహసాలతో కాపాడారు. మంటల్లో, దట్టమైన పొగలో చిక్కుకున్న ఓ మహిళను, చిన్నారిని కిటికీలో నుంచి నిచ్చెన వేసి బయటకు తీశారు. యంత్రాల సాయంతో కొందరిని రక్షించగలిగారు. మంటల ధాటికి చుట్టు పక్కల ఉన్న వాహనాలు దగ్ధమయ్యాయి.



పరారీలో భవన యజమాని


భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో గ్యారేజీ ఉండడంతో అందులో కారు రిపేర్ చేస్తుండగా మంటలు వ్యాపించాయి. సెల్లార్ లో డీజిల్, కెమికల్ డ్రమ్ములకు మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. గ్యారేజ్ లో ఉన్న మిగతా కెమికల్ డబ్బాలను అగ్ని మాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. భవన యజమాని రమేశ్ జైశ్వాల్ గా అధికారులు గుర్తించారు. అతనికి కెమికల్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉండడంతో వాటిని ఇక్కడ నిల్వ చేసినట్లు తెలుస్తోంది. ప్లాస్టిక్ తయారీ కోసం ఈ కెమికల్స్ వాడతారు. దాదాపు 30 డ్రమ్ములు పూర్తిగా అగ్నికి ఆహుతి కాగా, 100 డ్రమ్ములు కాలకుండా అధికారులు బయటకు తీసుకొచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ లో 150కి పైగా కెమికల్ డ్రమ్ములు నిల్వ చేసినట్లు తెలుస్తోంది.  పరారీలో ఉన్న భవన యజమాని రమేశ్ జైశ్వాల్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.


Also Read: Fire Accident In Nampally Today: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం - చిన్నారి సహా 9 మంది మృతి