తమ ప్రభుత్వ చిత్తశుద్ధితోనే తెలంగాణకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిందన్నారు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్. స్వచ్ఛ సర్వేక్షన్ 2021 జాతీయ స్థాయిలో అవార్డులు కైవసం చేసుకున్న పురపాలికల మేయర్లు, చైర్ పర్సన్లు,  కమిషనర్లు, పురపాలక శాఖ ఉన్నతాధికారులకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డుల కార్యక్రమం శనివారం జరిగింది.


కార్యక్రమం ముగిసిన అనంతరం అవార్డులు అందుకున్న వారితో నేడు డిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసంలో ప్రత్యకంగా సమావేశమయ్యారు. జాతీయ స్థాయిలో తెలంగాణ పట్టణాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం పట్ల చైర్ పర్సన్లకు, పురపాలక శాఖ అధికారులకు అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక గ్రామాలు, పట్టణాలు అనే వ్యత్యాసం లేకుండి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని చెప్పారు. సమగ్రంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే అంతా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుందని పిలుపునిచ్చారు. పట్టణ అభివృద్ధి ద్వారా రాష్ట్రాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు. 
Also Read: Bandi Sanjay: ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని బయటకు రప్పించాం... కేసీఆర్ నాటకాలు ఇక చెల్లవ్... బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు


గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం పట్టణాలకు ప్రత్యేక నిధులు కల్పించడంతోపాటు, పట్టణాల కోసం ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలను తీసుకువచ్చామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టడం, ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ, కృషితో పట్టణాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా పట్టణ పరిపాలనలో ప్రధానమంత్రి స్వనిది వంటి అనేక కార్యక్రమాల్లోనూ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు.


రాష్ట్రానికి జాతీయ స్థాయిలో సఫాయి మిత్ర విభాగంలో ద్వితీయ స్థానం అవార్డుతో పాటు మరో 11 స్వచ్ఛ సర్వేక్షన్ 2021 అవార్డులను సాధించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. పురపాలక శాఖ సిబ్బంది, పురపాలక సంఘాల ప్రజాప్రతినిధుల నిబద్ధతతో ఇది సాధ్యమవుతున్నదని మంత్రి అన్నారు. జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకున్న పురపాలక సంఘాలను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలోని ఇతర పట్టణాల మేయర్లు, చైర్ పర్సన్స్ కూడా మరింత చురుగ్గా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. 
Also Read:  నేరుగా కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు.. పక్కపక్కనే కూర్చొని కేసీఆర్-జగన్ ముచ్చట్లు


కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ్ సర్వేక్షణ్ 2021 అవార్డులలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఇండోర్ వరుసగా ఐదో ఏడాది క్లీనెస్ట్ సిటీగా నిలిచింది. గుజరాత్ కు చెందిన సూరత్, ఏపీకి చెందిన విజయవాడ వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. నవీ ముంబాయి ఒక్క స్థానం వెనక్కి నెట్టి విజయవాడ టాప్ 3గా అవార్డు గెలుచుకుంది.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి