Telangana Intermediate Exam 2021: ఇంటర్ విద్యార్థులకు పరీక్ష తప్పదా ?

తెలంగాణలో ఇంటర్ పరీక్షల నిర్వహణ తప్పదా? పది మంది విద్యార్థులు బోర్డును ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారిందా? అడిగితే పరీక్షలు నిర్వహిస్తామని గతంలో హామీ ఇచ్చిన సర్కార్ ఇప్పుడేం చేస్తుంది? అడిగిన పది మందికే పరీక్ష నిర్వహిస్తారా....మొత్తం ఇంటర్ విద్యార్థులందరకీ పరీక్ష తప్పదంటారా? 

ఇంటర్‌ రెండో ఏడాది పరీక్ష రద్దుతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని... పరీక్ష నిర్వహించాలని పది మంది విద్యార్థులు తెలంగాణ ఇంటర్మీడియెట్‌ బోర్డును ఆశ్రయించారు.  ప్రభుత్వం ఇచ్చిన మార్కులు సరిపోవడం లేదని, ఇంటర్‌ మొదటి ఏడాది మార్కులే ఇవ్వడం వల్ల సమస్యలు వస్తాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. రెండో ఏడాది ఎక్కువ మార్కులు సాధించాలన్న పట్టుదలతో చదివామంటున్నారు. 

పలు విద్యా సంస్థల్లో ఉన్నత విద్య అభ్యసించాలంటే ఇంటర్‌లో కనీసం 50% మార్కులు సాధించాలనే నిబంధన ఉందిని...అందుకే తాము పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. పరీక్షలు నిర్వహించకుంటే తమ భవిష్యత్తు అంధకారమవుతుందంటున్నారు.  

కరోనా కారణంగా తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. విద్యార్థుల మొదటి ఏడాది మార్కులు, ప్రాక్టికల్ మార్కుల ఆధారంగా వారికి ఇంటర్ బోర్డు మార్కులు కేటాయించింది.  అయితే ఇలా వచ్చిన మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు కోరితే.. కరోనా తగ్గిన తరువాత మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది.  ఈ మేరకు తమకు పరీక్షలు నిర్వహించాలని పది మంది విద్యార్థులు తెలంగాణ ఇంటర్మీడియెట్‌ బోర్డును ఆశ్రయించడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

తక్కువ మార్కులు వచ్చాయని ఎవరైనా భావించి పరీక్షలు రాస్తామంటే నిర్వహిస్తామని గతంలో ప్రభుత్వం హామీయిచ్చింది.  దీంతో తాజా విన్నపాలతో నోటిఫికేషన్‌ జారీచేసికోరుకున్నవారికి పరీక్ష నిర్వహించాలని యోచిస్తోంది. దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. వచ్చే ఆగస్టులో పరీక్షలు నిర్వహించడానికి వీలుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించింది. 

విద్యార్థులు అడగడం...ఇంటర్ మీడియెట్ బోర్డు ... ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం వరకూ సరే... కానీ కరోనా థర్డ్ వేవ్ ముప్పు ముంచుకొస్తోందనే హెచ్చరికలున్నాయ్. సెకెండ్ వేవ్ ఆరంభంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తీవ్రంగా నష్టపోయాం.  విద్యా సంస్థలు తెరవడం కారణంగా చాలామంది టీచర్లు, పిల్లలు కరోనా బారిన పడ్డారు. అలాంటి  పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే థర్డ్ వేవ్ విషయంలో ఇప్పటి నుంచీ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.  ఇప్పటికే పలుచోట్ల థర్డ్ వేవ్ కల్లోలం మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించాలన్న విద్యార్థులన వినతిపై  ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి....