తెలంగాణలోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు నిర్వహించే విషయంలో హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ విషయంలో జాప్యం చేయడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు జరపాలని దాఖలైన పిటిషన్ పై నేడు (జూలై 28) హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయవాది భాస్కర్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణ చేపట్టగా.. రాష్ట్ర వ్యాప్తంగా 220 సర్పంచి, 94 ఎంపీటీసీ, 4 జెడ్పీటీసీ, 5,364 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉందని పిటిషనర్‌ కోర్టుకు వెల్లడించారు. ప్రభుత్వం ఒప్పుకుంటే ఎన్నికలు జరపడానికి రెడీగా ఉన్నట్లుగా ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ధర్మాసనానికి వెల్లడించింది.


దీంతో ఖాళీగా ఉన్న పదవులకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని అడిగింది. వర్షాలు కురుస్తున్నా సరే ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ధర్మాసనం పేర్కొంది. అసలు ఎప్పట్లోగా ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు గట్టిగా అడిగింది. ఈ అంశంపై విచారణను హైకోర్టు  రెండు వారాలకు వాయిదా వేసింది.