హైదరాబాద్‌: పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, కాంప్లెక్స్‌ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 20 నుంచి 25 ఎకరాల్లో ఇంగ్లీష్ మీడియాలకు దీటుగా రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించి నర్సరీ నుంచి ఇంటర్ వరకు మెరుగైన ఉచిత విద్య అందిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్‌ స్కూళ్లకు ఇప్పటివరకూ సొంత భవనాలు లేవని, ఇరుకైన బిల్డింగ్స్ లో ఈ స్కూళ్లు ఉన్నాయన్నారు.


ప్రతి నియోజకవర్గంలో ఓ ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ స్కూల్
రాష్ట్ర సచివాలయంలో ఆదివారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు నిర్మిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంగ్లీష్ స్కూళ్లకు దీటుగా రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ లను నిర్మిస్తామని చెప్పారు. ఇది చాలా మంచి కార్యక్రమం కనుక దసరా పండుగ కంటే ముందే రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ల నిర్మాణానికి భూమి పూజ చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థపై స్పెషల్ ఫోకస్ చేసిందని, అందులో భాగంగా గురుకులాలు, రెసిడెన్షియల్‌ స్కూళ్లకు భారీగా నిధులు కేటాయిస్తామన్నారు. ఈ కాంప్లెక్సులను సాధ్యమైనంత త్వరగా నిర్మించి పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తామని చెప్పారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరించారు.






తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు సంబంధించిన ప్లాన్ మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ క్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర సీఎస్‌ శాంతికుమారి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


రాష్ట్రంలో అద్దె భవనాల్లోనే రెసిడెన్షియల్ స్కూళ్లు
‘సీనియర్ అధికారులతో ఓ కమిటీ వేశాం. కనీసం మూడు నెలల్లో వీటికి సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక చేసి ప్రభుత్వానికి అందిస్తారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో వసతులు సరిగ్గాలేదు. 1023 రెసిడెన్షియల్ స్కూళ్లు 620 స్కూళ్లకు బిల్డింగ్ లేదు. బీసీ వెల్ఫేర్ 327 స్కూల్లు ఉంటే 306 స్కూల్లు అద్దె భవనంలో ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు 268 ఉండగా అందులో 135 వరకు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. భవనాలు, మౌలిక వసతులు, టీచింగ్ ఫ్యాకల్టీ సరిగ్గా లేని కారణంగా విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కనుక మేం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థపై, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యపై ఫోకస్ చేశాం.


గత ప్రభుత్వం కేవలం రూ.73 కోట్లు ఖర్చు పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం తాము రూ.5000 కోట్లు కేటాయిస్తున్నాం. మాకు మంచి అవకాశం దొరికింది అనుకునేలా పిల్లలు మంచి విద్యా సంస్థల్లో చదివేలా చూస్తామని’ భట్టి విక్రమార్క పలు అంశాలను ప్రస్తావించారు. విద్యార్థులకు కేవలం చదువు మాత్రమే కాదు ఆటలు, పాటలు, ఇతర టాలెంట్ వెలికితీసేలా విధానాన్ని అవలంభిస్తామని చెప్పారు.


గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్లు అప్పు చేసినా స్కూల్ బిల్డింగ్స్ లేవు, సరైన విద్యా వసతి లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.  


Also Read: Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి