కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న పిన్నపురం జలవిద్యుత్ ప్రాజెక్టు వెంటనే ఆపాలని విజ్ఞప్తి చేస్తూ కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. కొత్త, ప్రస్తుత ప్రాజెక్టుల విస్తరణ ఆపాలని లేఖలో కోరారు. బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఏ ప్రాజెక్టులు చేపట్టవద్దని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. లేఖలోని అంశాలను కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. 


పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా ఆపాలి


కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు ఇప్పటికే తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ పలుమార్లు లేఖలు రాశారు. ​ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీరు తరలించకుండా నిలువరించాలని కోరారు. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా నీటి తరలింపును కూడా ఆపాలన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఇప్పటికే 76.39 టీఎంసీలు తరలించారని, హంద్రీనీవా ద్వారా ఏపీ 9.28 టీఎంసీలు నీరు తరలించారని ఈఎన్‌సీ లేఖలో ప్రస్తావించారు. 1976 ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ 34 టీఎంసీలలోపే నీరు తీసుకోవాలని కోరారు. కృష్ణా బేసిన్​కు మళ్లిస్తున్న గోదావరి జలాలను లెక్కించేందుకు టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని కోరారు.


Also Read: హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలుపు నాదే... టీఆర్ఎస్ ఓటర్లను బెదిరిస్తోంది... బీజేపీ నేత ఈటల రాజేందర్ కామెంట్స్


ఏపీవి నిరాధార వాదనలు 


ఆ జలాలను రెండు రాష్ట్రాలకు పంచాలన్న ఆంధ్రప్రదేశ్ నిరాధార వాదనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ స్పష్టం చేసింది. కృష్ణా బేసిన్​కు తెలంగాణ మళ్లిస్తున్న గోదావరి జలాలను లెక్కించేందుకు టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని, ఆ జలాలను రెండు రాష్ట్రాలకు పరిగణలోకి తీసుకోవాలని గతంలో ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖ రాసింది. దీనిపై వివరణ ఇస్తూ తెలంగాణ ఈఎన్‌సీ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ వాదన నిరాధారమైనదని లేఖలో తెలిపారు. సహేతుకం కాని డిమాండ్​ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 


Also Read: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉపసంఘాల సమావేశం... నేడు హైదరాబాద్ లో భేటీ... గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చ


గతంలోనూ లేఖ


కృష్ణా నీళ్లు ఇవ్వని ప్రాంతాలకే తాము గోదావరి నీళ్లు ఇస్తున్నామని గతంలో రాసిన లేఖలో తెలంగాణ ఈఎన్‌సీ కృష్ణా బోర్డుకు తెలిపారు. కృష్ణా నీళ్లు ఇవ్వని ప్రాంతాలకే గోదావరి నీళ్లు ఇస్తున్నామని వివరించారు. గోదావరి జలాల మళ్లింపుతో కృష్ణాలో నీరు మిగులుతోందని ఈఎన్‌సీ మురళీధర్‌ గుర్తుచేశారు. తెలంగాణ మళ్లిస్తున్న నీటిలో గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు భిన్నంగా ఏపీ వాటా కోరుతోందని అభ్యంతరం వ్యక్తంచేశారు. 1978లో కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం నాగార్జున సాగర్‌ పైన జలాలను వాడుకునే హక్కు తెలంగాణకు ఉందన్నారు. గతంలో ఏపీ ప్రభుత్వం రాసిన లేఖను పట్టించుకోవద్దని లేఖలో కోరారు. తెలంగాణలో గోదావరి నీటిని కృష్ణాబేసిన్‌కు తరలించే చోట టెలీమెట్రీలు ఏర్పాటు చేయడంతో పాటు గోదావరి నుంచి తరలించే జలాలను రెండు రాష్ట్రాలకు పంచాలని కేఆర్‌ఎంబీని కోరారు. 


Also Read: కృష్ణా, గోదావరి బోర్డుల ఉపసంఘాల భేటీ... ప్రాజెక్టుల వివరాలు ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలు అంగీకారం


ఐదు రోజుల క్రితం ఏపీ లేఖ 


ఏపీ ప్రభుత్వం మరోసారి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు తెలంగాణపై ఫిర్యాదు చేసింది. అనుమతి లేకుండా శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఆరోపిస్తూ ఐదు రోజుల క్రితం లేఖ రాసింది. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా నీరు వృధా అవుతుందని ఏపీ ప్రభుత్వం ఆ లేఖలో ఆరోపించింది. ఇప్పటి వరకూ విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు తెలంగాణ ప్రభుత్వం 113 టీఎంసీల నీటిని వదిలారని.. ఇది మొత్తం వృధాగా సముద్రంలోకి పోయిందన్నారు. వీటిని తెలంగాణ కోటాలో చేర్చాలని ఏపీ ప్రభుత్వం లేఖలో కృష్ణా బోర్డును కోరింది.


Also Read: తెలంగాణ గీత దాటింది ..జరిమానా విధించండి.. కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి