తెలంగాణ ప్రభుత్వం వాసాలమర్రిలో దళిత బంధు పథకాన్ని అమలు చేసింది. నిన్న (ఆగస్టు 4న) సీఎం కేసీఆర్ వాసాలమర్రి పర్యటన సందర్భంగా ఆయన అనూహ్య ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆ గ్రామంలో ఉన్న అన్ని దళిత కుటుంబాలకు రూ.10 లక్షల నగదు రేపే విడుదల చేస్తామని ప్రకటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆ మాట ప్రకారం ప్రభుత్వం.. ఇవాళ (ఆగస్టు 5న) దళిత బంధు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం యాదాద్రి జిల్లా వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు రూ.7.6 కోట్లు విడుదలకు అనుమతించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి జారీ చేశారు.


రూ.7.6 కోట్లను తక్షణం విడుదల చేయాల్సిందిగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి ఆదేశాలు జారీ చేశారు. రూ.7.6 కోట్లను ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పంచనున్నారు. ఆ డబ్బుతో లబ్ధిదారుల కుటుంబాల వారు మెరుగైన ఉపాధి కోసం ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని దత్తత గ్రామం వాసాలమర్రిలోని దళిత వాడల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సుమారు 3 గంటలపాటు పర్యటించిన సంగతి తెలిసిందే.


Also Read: Hyderabad Suicide: కుంకుమ చేజారింది, హారతి ఆరిపోయిందని ప్రాణం తీసుకున్న యువతి


కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
దళిత బంధు నిధులను మంజూరు చేయడంతో గురువారం వాసాలమర్రిలోని దళిత కుటుంబాల వారు సీఎం కేసీఆర్ ఫోటోకి పాలాభిషేకం చేశారు. ఊహించ‌ని వరం కేసీఆర్‌ ఇవ్వడంతో స్థానిక దళిత కుటుంబాలు సంతోషంలో మునిగి తేలుతున్నాయి. గురువారం దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ అవ్వడంతో గ్రామమంతా డప్పుచప్పుళ్లతో సందడిగా మారింది. కేసీఆర్ చిత్ర ప‌టానికి పాలాభిషేకం చేసి ఆయ‌న‌పై తమకు ఉన్న అభిమానాన్ని గ్రామస్థులు చాటుకున్నారు.


దళిత బంధు అనే పేరుపై అభ్యంతరం
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘దళిత బంధు’ పథకం పేరుపై జాతీయ ఎస్సీ కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఎస్సీ కమిషన్ నోటీసులు కూడా ఇచ్చింది. దళిత బందు పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ.. మాల సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు బత్తుల రామ్ ప్రసాద్ జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు అందులో పిటిషన్ దాఖలు చేయగా.. ఎస్సీ కమిషన్ కూడా దానిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. 


దళిత బంధులో ‘దళిత’ అనే స్థానంలో ‘అంబేడ్కర్’ అనే పదాన్ని వాడాలని మాల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు బత్తుల రామ్ ప్రసాద్ సూచించారు. ‘దళిత’ అనే పదానికి ‘అంటరానివారు’, ‘తక్కువ చూపునకు గురయ్యేవారు’, ‘నిస్సహాయులు’ అనే అర్థాలు వస్తున్నాయని కాబట్టి దాన్ని మార్చాలని బత్తుల రామ్ ప్రసాద్ పిటిషన్‌లో వివరించారు. ఇందులో భాగంగా జాతీయ ఎస్సీ కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి నోటిసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా ఆ అంశంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించింది.


Also Read: Secunderabad: ట్రైన్‌లో తన బ్యాగ్ ఎవరో కొట్టేశారని... స్టేషన్‌లో మరో బ్యాగ్ లేపేశాడు... ట్విస్టులు మమూలుగా లేవు