Tamilsai :  గవర్నర్‌గా తాను రాజకీయాలు చేయలేదని ప్రజలకు సేవ చేసేందుకే ప్రయత్నించానని తెలంగాణ గవర్నర్ తమిళిసై తెలిపారు. తెలంగాణ గవర్నర్‌గా నాలుగేళ్ల కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో.. రాజ్‌భవన్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.  తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తనపై.. ఇక్కడి ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు.


ప్రగతి భవన్ తో దూరం లేదు - కేసీఆర్ పవర్ ఫుల్ నేత : తమిళిశై


తాను  ఎక్కడ ఉన్నా తెలంగాణతో బంధం మరిచిపోనని..  సవాళ్లకు, పంతాలకు భయపడే వ్యక్తిని కానని గవర్నర్ తెలిపారు.  బాధ్యతలు, విధులను సమర్థవంతగా నిర్వర్తిస్తూ.. తెలంగాణలో గవర్నర్‌గా నాలుగేళ్ల కాలం పూర్తి చేసుకున్నానని సంతృప్తి వ్య్కతం చేశారు.  అలాగే కోర్టు కేసులకు, విమర్శలకు భయపడబోనన్నారు.  ప్రొటోకాల్‌ ఉల్లంఘనతో తనను కట్టడి చేయలేరని తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి వచ్చా...  ప్రజల విజయమే విజయమని తమిళిసై వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వంతో వివాదం పెట్టుకునే ఉద్దేశం.. కొట్లాడే ఉద్దేశం లేదన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ లీడర్.. పవర్ ఫుల్ నేత. నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన నేను చూస్తున్నా. రాజ్‌భవన్‌కి, ప్రగతి భవన్‌కు గ్యాప్‌ లేదు. సీఎంతో ఎలాంటి దూరం లేదు. దూరం గురించి నేను పట్టించుకోను... తన దారి తనదేనన్నారు. 


గవర్నర్ ఆఫీస్‌కు పరిమితులు ఉంటాయి !


ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఉంది కానీ  గవర్నర్ ఆఫీస్‌కు కొంత లిమిట్ ఉందని తమిళిశై గుర్తు చేశారు.  నిధుల కొరత కూడా ఉందన్నారు. ప్రజలకు సేవ చేయడం తప్ప..పొలిటికల్ ఎజెండా లేదన్నారు. తనది మోసం చేసే తత్వం కాదని స్పష్టం చేశారు.   తెలంగాణ బర్త్ డే- నా బర్త్ డే ఒకేరోజు. నా మైండ్ లో ఎప్పుడూ ప్రజలకు సేవ చేయాలనే ఉంటుందన్నారు. తాను   నిరంతరం సంతోషంగా ఉండే వ్యక్తినన్నారు.  పుదుచ్చేరికి కూడా గవర్నర్ గా ఉన్నా.. తెలంగాణ ప్రజల కోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా. అడ్మిస్టేషన్ పరంగా రెండు రాష్ట్రాలకూ నా బాధ్యత నిర్వర్తిస్తున్నా. ఇక్కడ జిల్లాలకు వెళ్తే ఐఏఎస్ అధికారులు రారు. కానీ, పుదుచ్చేరిలో సీఎస్ సహా చాలా మందిని పర్యవేక్షిస్తున్నాను. నాకు గౌరవం ఇస్తారా.. నా పనిని గుర్తిస్తారా? అనేది నాకు అవసరం లేదని స్పష్టం చేశారు. 


ఎమ్మెల్సీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు ! 


ఆర్టీసీ బిల్లుపై అనవసర కాంట్రవర్సీ జరిగింది. నేను ఆర్టీసీ కార్మికుల లబ్ధికోసమే బిల్లుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అనేది కేటగిరి ఉంటుంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై ప్రభుత్వం కేటగిరి పూర్తిగా స్పష్టత ఇవ్వలేదు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అనేది పొలిటికల్ నామినేషన్ కాదు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కి అర్హత ఉందనిపిస్తే.. సంతకం చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.  మెడికల్ కాలేజీల వ్యవహారంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం జరిగింది. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉండాలి. మెడికల్ కాలేజీలు ఇవ్వడానికి కేంద్రం అడిగిన సమయంలో రాష్ట్రం స్పందించలేదనే విషయాన్ని కేంద్రం చెప్పింది. తెలంగాణ రాష్ట్రానికి కూడా మెడికల్ కాలేజీలు కేంద్రం ఇచ్చిందన్నారు.