ప్రజలు అత్యవసరమైతేనే తప్పా బయటకు రావొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. భారీ వర్షాల వేళ జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్, ట్రాన్స్ కో ఎండీ, ఈవీడీఎం డైరెక్టర్, హైదరాబాద్‌ కలెక్టర్‌తో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు.  ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. చెట్లు, కొమ్మలు, కూలిన చోట నుంచి వెంటనే తొలగించాలని ఆదేశించారు.  హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్‌ నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. నాలాల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ తీసుకోవాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర సేవలకు జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూమ్ నంబర్లు 040-21111111, 23225397లో సంప్రదించాలన్నారు. 


ప్రజలు ఇళ్ల వద్ద అప్రమత్తంగా వ్యవహరించాలని ట్రాన్స్ సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. భారీ వర్షాల దృష్ట్యా విద్యుత్‌ సరఫరా పరిస్థితిపై అధికారులతో ట్రాక్స్‌కో సీఎండీ సమీక్షి నిర్వహించారు. విద్యుత్‌ పరికరాలకు, విద్యుత్‌ తీగలకు దూరంగా ఉండాలని...బయటకు వెళ్లినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఎక్కడైనా విద్యుత్‌ తీగలు తెగిపడితే వెంటనే సిబ్బందికి చెప్పాలని...లోతట్టు ప్రాంతాలు, భవనాల సెల్లార్లలో నీరు చేరితే సమాచారం ఇవ్వాలని కోరారు.  అందించాలని కోరారు. ఏవైనా సమస్యలు కోసం 1912, 738207214, 7382072106, 7382071574 నంబర్లలో ఫిర్యాదు చేయోచ్చని తెలిపారు. విద్యుత్‌ సమస్యలను వాట్సప్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ ద్వారా కూడా చెప్పవచ్చని వెల్లడించారు. 


ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, అల్వాల్, బాలాజీ నగర్, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట్ ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో రహదారులన్నీ జలమయం అయ్యాయ్.  డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రహదారులపై నీరు నిలిచి పోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మరో రెండు గంటలపాటు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది.


రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయింది. మియాపూర్‌లో అత్యధికంగా 14 సెంటీమీటర్లు, బండ మైలారంలో 13.8 సెం.మీ, దుండిగల్‌ ఫారెస్ట్‌ అకాడమీలో 12.9 సెం.మీ., కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లో 12.7 సెం.మీ.,  శేరిలింగంపల్లి 11.45 సెం.మీ., షేక్‌పేటలో 11.9 సెం.మీ., బోరబండ 11.6 సెం.మీ., గాజుల రామారం 10.9 సెం.మీ., మాదాపూర్‌లో 10.7 సెం.మీ., షాపూర్‌లో 10.6 సెం.మీ., బాచుపల్లి, రాయదుర్గంలో 10.1 సెం.మీ., ఖైరతాబాద్‌ 10.1 సెం.మీ., రాజేంద్రనగర్‌లో 10 సెం.మీ., గచ్చిబౌలిలో 9.6 సెం.మీ., బహదూర్‌పురా 8.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.


జంట జలాశయాలకు వరద పోటెత్తింది. హిమాయత్‌సాగర్‌ 2 గేట్లను ఎత్తి దిగువ వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్‌లోకి 1200 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1373 క్యూసెక్కుల నీరు మూసీలోకి వెళ్తోంది. సాగర్‌లో ఇప్పుడు 1763.20 అడుగుల వద్ద నీటిమట్టం ఉందిది. పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు. వర్షం ఇలాగే కురిస్తే...హిమాయత్‌ సాగర్‌ మరో రెండు గేట్లను ఎత్తే అవకాశం ఉంది. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో గండిపేటకు భారీగా వరదవస్తోంది.