TRS Mlas Security : తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తీవ్ర సంచలనం అయింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ముగ్గురు వ్యక్తులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో జరిపిన బేరసారాల వీడియోలను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, న్యాయమూర్తులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ వీడియోలు పంపించామని కేసీఆర్ అన్నారు. ఇదంతా కేసీఆర్ డైరెక్షన్ లో జరిగిన డ్రామా అని బీజేపీ కొట్టిపడేస్తుంది. కేసీఆర్ ఫస్ట్ షో , సెకండ్ షో అని కామెడీ షో చూపించారని బండి సంజయ్ విమర్శించారు. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నలుగురు ఎమ్మెల్యేల భద్రతను పెంచింది.  


నలుగురు ఎమ్మెల్యేల భద్రత పెంపు 


ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో ఉన్న నలుగురు ఎమ్మెల్యేల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నలుగురు ఎమ్మెల్యేలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు మంత్రి స్థాయి భద్రత కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. నలుగురు ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద భద్రత పెంచింది. ఇటీవల మెయినాబాద్‌ సమీపంలోని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌ హౌజ్‌లో ఎమ్మె్ల్యేలు రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజుతో రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ అనే ముగ్గురు వ్యక్తులు బేరసారాలు చేశారు. బీజేపీలో చేరిందుకు వంద కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ ఘటన ఆడియో, వీడియోలను టీఆర్ఎస్ బయటపెట్టింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో  ఈ ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేశారు.


అధిష్ఠానం ఆధీనంలో నలుగురు ఎమ్మెల్యేలు 


ఎమ్మెల్యేలకు ఎర ఘటనలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తో మాట్లాడిన రెండు ఆడియో టేపులు బయటకు వచ్చాయి. ఫామ్ హౌస్ వ్యవహారం మొత్తాన్ని సీఎం కేసీఆర్ మీడియో ముందు విడుదల చేశారు. ఈ ఆడియో, వీడియోలను అన్ని రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు పంపామని చెప్పారు. అయితే ఫామ్ హౌస్ ఘటన అనంతరం నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నాయకత్వం ఆధీనంలోనే ఉన్నారని సమాచారం. మునుగోడు ఉపఎన్నికలో సీఎం కేసీఆర్ ప్రచార సభలో ఆ నలుగురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నిన్నటి మీడియా సమావేశంలో నలుగురు ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్  వారిని తన పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఇప్పటికే పైలెట్ రోహిత్ రెడ్డికి భద్రతను పెంచిన ప్రభుత్వం, తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేల భద్రతస్థాయిని పెంచింది.  


కేసీఆర్ ఏమన్నారంటే? 


 కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రయత్నిస్తోందన్న ఆధారాలను కేసీఆర్ బయట పెట్టారు.  ప్రజాస్వామ్య హంత‌కుల స్వైర విహారం దేశం పునాదుల‌కే ప్రమాద‌క‌రం అని కేసీఆర్ పేర్కొన్నారు. నిన్న మునుగోడులో పోలింగ్ ముగిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ముఠా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు తిరుగుతోందని.. దీనికి అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్‌లు నాయకత్వం వహిస్తున్నారని ప్రకటించారు. మూడు గంటల ఫామ్ హౌస్ వీడియోలు ఉన్నాయని.. అయితే ప్రేక్షకుల.. ప్రజల కోసం వాటిని గంటకు కుదించి అందరికీ పంపిస్తున్నామని ప్రకటించారు. దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మార్చారని.. ఆ ఆపరేషన్ల గుట్టు మొత్తం ఆ వీడియోలో ఉందన్నారు.