Telangana Government Update On Indiramma Houses: తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) నిర్మాణానికి సంబంధించి మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) శనివారం కీలక ప్రకటన చేశారు. పథకంలో భాగంగా ఈ నెలాఖరులోపు మొదటి విడత కింద రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. అర్హులైన వారందరికీ ఇళ్లు ఇస్తామని స్పష్టం చేశారు. భూపాలపల్లి జిల్లా (Bhupalapally District) గణపురం మండలంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క పర్యటించారు. గాంధీనగర్ క్రాస్ మైలారం గుట్టపై ఇండస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొంగులేటి మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ ఏ వేదికపైకి ఎక్కినా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గురించి మాయమాటలు చెప్పారని, తన సొంత నియోజకవర్గంలో నిర్మించిన ఇళ్లను పేపర్లలో ఫోటోలు వేయించుకుని ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో ఓట్లు అడిగారని మండిపడ్డారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 1.50 లక్షల ఇళ్లు మాత్రమే నిర్మిస్తే నేడు ఇందిరమ్మ ప్రభుత్వం మొదటి విడతలోనే 4.50 లక్షల ఇళ్లు నిర్మించబోతున్నట్లు చెప్పారు.


సాగు భూములకు పట్టాలు


సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమే జోడెద్దుల్లా పేదల కోసం కృషి చేస్తుందని మంత్రి పొంగులేటి అన్నారు. భూములు సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్థికంగా భారమైనా రైతు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. 'గత ప్రభుత్వం రూ.7.20 లక్షల కోట్లు అప్పులు చేసింది. రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట నెరవేర్చాలని సీఎం పట్టుబట్టి రుణమాఫీ చేస్తున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో రూ.లక్షన్నర వరకు ఉన్న రుణాలు మాఫీ చేశాం. ఈ నెలాఖరు వరకు రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తాం. రైతులకు అవసరమైన పనిముట్లలో ఇవ్వాల్సిన రాయితీలను బీఆర్ఎస్ ప్రభుత్వం మర్చిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజుగా చేసేందుకు రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా, వ్యవసాయ పనిముట్లపై రాయితీ, పంట ఇన్సురెన్సు, విత్తనాలపై రాయితీలు ఇస్తున్నాం.' అని మంత్రి పేర్కొన్నారు.


Also Read: IAS Transfers In Telangana: తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ