తెలంగాణలో మరోసారి ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎనిమిది మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వికాస్ రాజ్‌కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ని రవాణా, హౌసింగ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్  ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది. స్మార్ట్ గవర్నెన్స్‌తోపాటు కేంద్రంతో కోఆర్డినేషన్ బాధ్యత ఇచ్చారు.


కమర్షియల్ ట్యాక్స్ శాఖ కమీషనర్‌గా ఉన్న శ్రీదేవిని షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌గా బదిలీ చేసింది ప్రభుత్వం. సయ్యద్‌ అలీ ముర్తుజా రిజ్వీకి వాణిజ్య శాఖకు సంబంధించి అదనపు బాధ్యతలు అప్పగించారు. రెవెన్యూ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ జాయింట్‌ సెక్రటరీగా హరీష్‌ను నియమించింది. ప్రస్తుతం ఈయన ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లో జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. 


ఉదయ్‌ కుమార్‌ను మార్కెటింగ్ శాఖకు మార్చారు. ప్రియాంకను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ డిప్యూటీ సెక్రటరీగా మార్చారు. ఈమె ఇప్పటి వరకు సూర్యపేట అడిషనల్ కలెక్టర్‌గా ఉన్నారు. చంద్రశేఖర రెడ్డిని హాకా ఎండీగా బదిలీ చేశారు. ఇప్పుడు ఆయన సహకార శాఖలో జాయింట్ రిజిస్ట్రార్‌గా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డిని మార్క్‌ఫెడ్‌ ఎండీగా బదిలీ చేశారు. ఇప్పుడు ఈయన వరంగల్ వాణిజ్య పన్నుల విభాగం కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.