తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంలో పెను విషాదాన్ని మిగిల్చాయి. వర్షాలతో వందల మంది నిరాశ్రయులయ్యారు. వరదలతో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మొత్తం 17 మంది మృతి చెందారు. మరో 9 మంది గల్లంతు అయ్యారు. కనిపించకుండా పోయిన వారికోసం ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ములుగు జిల్లాలో 8 మంది వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందారు. మల్యాలలో వరదలో గల్లంతైన వారి మృతదేహాలు లభ్యమయ్యాయి.


మృతులను అజ్జు, షరీఫ్, మైబూబ్ ఖాన్, సమ్మక్క, మాజీద్‌, కరీమ్, రశీద్, బీబీ అని అధికారులు గుర్తించారు. కొండాయి గ్రామంలో జంపన్న వాగు ఉగ్రరూపం దాల్చడంతో గ్రామం మునిగిపోయింది. 8 మంది వరద నీటిలో చిక్కుకుని మృత్యువాత పడ్డారు. సహాయక బృందాలును మృతదేహాలను గుర్తించాయి. హన్మకొండలో ముగ్గురు, ఉమ్మడి ఖమ్మంలో ముగ్గురు, మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు, భూపాలపల్లిలో ఒకరు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. 


ములుగు జంపన్న వాగులో గల్లంతై మరణించిన కుటుంబాలకు రూ. 4 లక్షలు పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. తక్షణ సాయం కింద రూ. 25 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. వరదలతో నష్టపోయిన బాధితులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. అయితే మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు పరిహారం, సర్వస్వం కోల్పోయిన వారికి రూ. 25 లక్షలు ప్రకటించాలని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. వరద బాధిత కుటుంబాలకు లక్ష రూపాయిలు చొప్పున ఇవ్వాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. వరంగల్‌ను వరదలు ముంచెత్తడం ఇది మూడోసారని.. అయినా ప్రభుత్వం మొద్దు నిద్రలోనే ఉందని ప్రతిపక్షాలు విమర్శించాయి.


భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. గురవారం (జూన్ 28) నాడు గ్రామం వరదలో చిక్కుకోగా.. ప్రజలందర్నీ ప్రభుత్వం క్షేమంగా సురక్షిత ప్రాంతాలకు తరలించింది. శుక్రవారం కొందరు  పునరావాస కేంద్రాల నుంచి గ్రామానికి చేరుకున్నారు. ఇళ్లు బురదతో నిండిపోయాయి. అధికారులు ఆహారం, దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు.