ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు దుర్వినియోగం చేసిందని, అధికారిక, అనధికారిక లెక్కలు అంటూ పురంధేశ్వరి మాట్లాడారని మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలా? లేక చంద్రబాబు గారి అధ్యక్షురాలా అనేది అర్థం కావడం లేదని మంత్రి ఎద్దేవా చేశారు. నేడు పురంధేశ్వరి మరిదిగారి స్క్రిప్ట్ చదివిందని, ఎక్కడికి వెళ్లినా చిన్నమ్మ ఇదే స్క్రిప్ట్ చదువుతున్నారని అన్నారు. చిన్నమ్మకు స్టేట్ లో రాజకీయాలు చేయాలని తపన ఉందని అన్నారు.


తండ్రి పార్టీ మరిది నడుపుతారని.. మరిది స్క్రిప్ట్ ఈమె చదువుతారని ఎద్దేవా చేశారు. మరిది గారిని అధికారంలోకి తేవాలని తాపత్రయ పడుతున్నారని అన్నారు. పిల్లని ఇచ్చాడు కనుక అటు బాలకృష్ణ మాట్లాడలేరని, దగ్గుపాటి వెంకటేశ్వర రావు సలహా లేకుండా పార్టీ నడిచేది కాదని విమర్శించారు. అలాంటి మీ భర్తని ఈ మాయల పకీర్ ఏమి చేశాడో అందరికి తెలుసని గుడివాడ అమర్ నాథ్ మాట్లాడారు.


‘‘ఇప్పుడు మీరు కూడా ఆ మాయలో పడి మీ భర్తలా అయితే మేము ఏమి చేయలేం. మద్యం నుండి వచ్చిన ఆదాయంతో సంక్షేమమే అనడం దారుణం. బీజేపీ పాలిత రాష్ట్రాలలో మద్యం మీద ఆదాయం రావడం లేదా? సంక్షేమం అమలు చేసేటప్పుడు నిధులు వాడతాం. మధ్యాహ్న భోజన పథకం కోసం కేంద్రం నుంచి రూ.400 కోట్లు వస్తే మేం రూ.1,500 కోట్లు ఖర్చు పెట్టాం. రాష్ట్రాలకు వచ్చే ఆదాయాన్ని మాత్రమే మాకు తిరిగి పంపిస్తారు. ఆ లెక్కలు తెస్తే చర్చకు సిద్ధం’’


కేంద్రంలో ఉన్న వారు చెప్పిన లెక్కలు కాదు.. ఇవి మరిది గారి మాటలు మాత్రమే. భూముల మీద ఉన్న శ్రద్ధ ఆ రోజు మీ మరిది గారు ఉన్నప్పుడు ఎందుకు గుర్తు రాలేదు? బాబు జనతా పార్టీ కోసం పని చేస్తున్నారు. మీరు కేంద్ర మంత్రిగా, విశాఖ ఎంపీగా పని చేశారు. 20 లక్షలు ఇళ్ల నిర్మాణం ఏపీలో జరిగిందని కిషన్ రెడ్డి చెప్పారు. చిన్నమ్మ మాట నమ్మాలా.. కిషన్ రెడ్డి మాట నమ్మాలా? అధికారికంగా బీజేపీలో ఉండి అనధికారికంగా టీడీపీకి వత్తాసు పలకడం మానండి. మరిది గారు ఆరోజు ఆంధ్రాకి ప్యాకేజీ చాలు అన్నారు. దానితో ఏకీభవిస్తారా?’’ అని గుడివాడ అమర్ నాథ్ ప్రశ్నించారు.


సైకిళ్ల పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అమర్నాథ్ 
🔸అనకాపల్లి నియోజకవర్గంలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న 9, 10 వ తరగతి విద్యార్థినిలకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చొరవతో, అరబిందో ఫార్మా ఫౌండేషన్ సౌజన్యంతో సుమారు 2500 సైకిళ్లను శనివారం పంపిణీ చేయనున్నారు.
🔸 స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి మంత్రి అమర్నాథ్ తో పాటు అరబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్, అరబిందో ఫార్మా లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్ అయిన కే.నిత్యానంద రెడ్డి చేతుల మీదుగా ఈ సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. 
🔸ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి అమర్నాథ్ శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు. స్టేడియంకు వచ్చే విద్యార్థులకు,  వారి తల్లిదండ్రులకు తగిన ఏర్పాట్లు చేయాలని, స్టేడియం బయట ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూడాలని సూచించారు.
🔸 అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆడపిల్లలను ప్రోత్సహించేందుకు సైకిళ్లను అందజేస్తున్నామని చెప్పారు. అరబిందో ఫార్మా ఫౌండేషన్ సుమారు కోటి 75 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఈ సైకిళ్లను అందిస్తోందని చెప్పారు. టాటా కంపెనీకి చెందిన ఒక్కో సైకిలు సుమారు 6,500 రూపాయలు ఉంటుందని మంత్రి అమర్నాథ్ తెలిపారు.