Telangana election 2023: ఎన్నికల్లో ఓటర్లు పరిణతితో ఆలోచించి ఓటెయ్యాలని, అలాంటప్పుడే ప్రజాస్వామ్యం గెలుస్తుందని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. దేవరకద్ర బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు రాగానే ప్రజలు గందరగోళానికి గురి కావొద్దని, పార్టీ చేసిన అభివృద్ధి, అభ్యర్థి చరిత్ర అన్నీ చూసి ఓటెయ్యాలని సూచించారు. ఓటును సరిగ్గా వాడితేనే బంగారు భవిష్యత్తు సొంతమవుతుందని స్పష్టం చేశారు. కృష్ణా, తుంగభద్ర నదులు పారే ఈ పాలమూరు జిల్లాను సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ధ్వజమెత్తారు. అద్భుతమైన జిల్లాను సమైక్య రాష్ట్రంలో ఘోరమైన స్థితికి తెచ్చారని మండిపడ్డారు. వలసలు వెళ్లి బాధలు అనుభవించిన జిల్లా పాలమూరు అని అన్నారు. గత పాలకులు ఉమ్మడి జిల్లాలో గంజి కేంద్రాలు పెట్టారని, సమైక్య పాలనలో ఉన్న ప్రాజెక్టులను రద్దు చేశారని విమర్శించారు.


'కళ్ల ముందే అభివృద్ధి'


కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అభివృద్ధి మీ కళ్ల ముందే ఉందని కేసీఆర్ తెలిపారు. కరివెన రిజర్వాయర్ పనులు పూర్తి కావొచ్చాయని, అది అందుబాటులోకి వస్తే దేవరకద్ర నియోజకవర్గంలో మొత్తం 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. నెట్టెంపాడు, బీమా, కల్వకుర్తి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసుకుని నీళ్లు తెచ్చుకున్నామని వివరించారు. పాలమూరు - రంగారెడ్డి పథకానికి అడ్డుంకులన్నీ తొలగిపోయాయని, త్వరలోనే నీళ్లన్నీ రాబోతున్నాయని స్పష్టం చేశారు. దేవరకద్ర నియోజకవర్గ అభ్యర్థి వెంకటేశ్వర రెడ్డి మంచి వ్యక్తని పట్టుబట్టి 30 చెక్ డ్యాంలు మంజూరు చేయించి లక్ష ఎకరాల్లో వరి పండించేలా చేశారని గుర్తు చేశారు. ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గద్వాల సభకు బయలుదేరారు.


'గద్వాలను గబ్బు పట్టించారు'


గద్వాలను గబ్బు పట్టించిన వారెవరని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన, గద్వాల ప్రాంతానికి ఘన చరిత్ర ఉందని, ప్రపంచంలోనే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ అమ్మవారు కొలువైన ప్రాంతానికి ఆ పేరు పెట్టుకున్నామని వివరించారు. ఇక్కడ బోయ, వాల్మీకి సోదరులు ఎక్కువగా ఉంటారని, ఆంధ్రాలో వారు ఎస్టీలని, ఇక్కడ మాత్రం వారు బీసీలని చెప్పారు. తెలంగాణలో వాల్మీకి, బోయ తెగలను ఎస్టీల్లో కలిపేందుకు తాను ప్రయత్నించినట్లు గుర్తు చేశారు. దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపించినా ఫలితం లేదని పేర్కొన్నారు. 'మాజీ సీఎం నీలం సంజీవరెడ్డి వాల్మీకి, బోయలకు అన్యాయం చేశారు. ఆనాడు వారిని ముంచింది కాంగ్రెస్ ముఖ్యమంత్రే. ఆర్డీఎస్ కాలువను ఆగం పట్టించిన పార్టీ కాంగ్రెస్సే' అని కేసీఆర్ పేర్కొన్నారు. 


ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేసుకున్నామని, ఇవాళ నెట్టెంపాడు కింద లక్షా 60 వేల ఎకరాలను నీరు పారుతోందని కేసీఆర్ వివరించారు. ర్యాలంపాడు రిజర్వాయర్ పెద్దగా చేసి గద్వాలను పచ్చగా మార్చుకున్నామని, గట్టు మండలానికి నీళ్లు కావాలని ఎత్తిపోతల పథకం కూడా తెచ్చామని చెప్పారు. అన్ని రకాలుగా గద్వాల అభివృద్ధి జరిగిందని, ప్రజలకు మంచి చేయాలని అహర్నిశలు శ్రమిస్తోన్న బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.


Also Read: KA Paul: 30 సీట్లొచ్చినా తెలంగాణలో నేనే సీఎం, రెగ్యులర్‌గా టచ్‌లో రాహుల్ - కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు