Telangana Elections 2023 :  తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది.  నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమయింది. అయితే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పందొమ్మిది స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తీవ్రమైన పోటీ, వామపక్షాలతో పొత్తుల చర్చల కారణంగా ప్రకటన ఆలస్యం అవుతోంది. అయితే నామినేషన్ల కంటే ముందే ఈ 19 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తారనుకుంటే..  ఇప్పటికీ స్పష్టత లేదు. అసలు ఈ స్థానాలపై హైకమాండ్ కే నిర్ణయం వదిలేయడంతో ఎవరి పేర్లు ప్రకటిస్తారు.. ఎప్పుడు ప్రకటిస్తారా అని ఎదురు చూస్తున్నారు. 


పెండింగ్ లో ఉన్న స్థానాలు ఇవే !


కాంగ్రెస్ పార్టీ పెండింగ్ లో పెట్టిన స్థానాలు ...  వైరా, కొత్తగూడెం, మిర్యాలగూడ, చెన్నూరు, చార్మినార్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యపేట, తుంగతుర్తి, బాన్సువాడ, జుక్కల్, పటాన్ చెరువు, కరీంనగర్, ఇల్లందు, డోర్నకల్, సత్తుపల్లి, అశ్వారావుపేట, నారాయణ్ ఖేడ్ . వీటిలో అభ్యర్థుల కోసం పార్టీలోని సీనియర్ నేతలు.. తలా ఓ పేరు ప్రతిపాదించారు. తాము చెప్పిన వారికే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను హైకమాండ్‌కు అప్పగించింది. 


అన్ని స్థానాల్లో భారీ పోటీ 


రెండు జాబితాల ద్వారా  కాంగ్రెస్ 100 మంది అభ్యర్ధుల పేర్లు ఖారారు చేసింది. మిగిలిన 19 స్థానాల విషయంలో తర్జన భర్జన కొనసాగుతుంది.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ కి చెక్ పెట్టి తాము అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగానే సీనియర్ నేతలు తెలంగాణలో కాంగ్రెస్ ఆకర్ష్ ని మొదలు పెట్టారు. పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో వారికి టిక్కెట్లు సర్దుబాటు చేయాల్సి వస్తోంది. ఈ 19 నియోజకవరాల్లో కాంగ్రెస్ బలంగానే ఉంది. అభ్యర్థులను ఖరారు చేయకపోవడం వల్ల కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీల్లో .. హైదరాబాద్‌లో మకాం వేశారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాలు కూడా జరగడం లేదు. 


వామపక్షాలతో పొత్తులపై డైలమా 


పెండింగ్‌లో 19 సీట్లలో 4 కమ్యూనిస్టులకు కేటాయించాలని నిర్ణయించారు. ఆ మేరకు చర్చలు జరిపారు. అయితే ఏ సట్లను కేటయించాలన్నదానిపై అంగీకారం కుదరలేదు. చివరికి సీపీఎం సొంతంగా పోటీ చేస్తామని ఓ జాబితా విడుదల చేసింది.  కమ్యూనిస్టులకుబ లం ఉన్న ఖమ్మం జిల్లా ఇల్లందు, అశ్వరావుపేట, సత్తుపల్లి సీట్లు ఇంకా ప్రకటించలేదు. ఇక నల్లగొండ జిల్లా విషయానికి వస్తే.. తుంగతుర్తి, సూర్యపేట అభ్యర్థుల విషయంలో తర్జన భర్జన కొనసాగుతోదంి.  కమ్యూనిస్టులతో ఇంకా చర్చలు సాగుతున్నాయని రేవంత్ రెడ్డి  చెబుతున్నారు. కమ్యూనిస్టులతో చర్చలు కొలిక్కి వస్తే.. నేడో రేపో.. మొత్తం  పందొమ్మిది స్థానాలకూ అభ్యర్తుల్ని ప్రకటంచాలని అనుకుంటున్నారు.  కామారెడ్డిలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీలో ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రకటనపైనా స్పష్టత రావాల్సి ఉంది.