Telangana Elections 2023 Harish Rao  :   రాహుల్ గాంధీ ఆరు గ్యారంటీలు అంటూ తెలంగాణ ప్రజలను మోసం చేయటానికి వస్తున్నారని.. కర్ణాటక లో ఇచ్చిన హామీలే అమలు కావడం లేదు.. కర్ణాటక లో ( Karnataka ) ఓటేసిన ప్రజలకు పథకాలు అందటం లేదని హరీష్ రావు  విమర్శించారు. తెలంగాణ భవన్ లో  ( Telangana Bhavan ) కాంగ్రెస్ నేత కత్తి కార్తీక పార్టీలో చేరిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.  కర్ణాటక ప్రజలు ఏది అడిగినా ఖజానా ఖాళీ అయ్యింది అని అక్కడ సీఎం చెప్తున్నారన్నారు.  అయిదు గ్యారంటీ లని చెప్పిన కాంగ్రెస్  ( Congress ) ప్రజలకు రాం రాం చెప్పారన్నారు.  ఎన్నికలప్పుడు ఓడ మల్లప్ప ,ఎన్నికలు ముగియగానే బోడ మల్లప్ప అన్నట్టుగా ఉన్నది రాహుల్ గాంధి తీరు ఉందన్నారు.  కర్ణాటక లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరునెలలు పూర్తవుతుంది .  కర్ణాటక ఎన్నికలపుడు గ్యారంటీల ప్రారంభానికి కాలపరిమితి పెట్టిన రాహుల్ గాంధీ ఇపుడు రకరకాల షరతులను పెడుతూ ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. 


గెలిచే వరకు ఒక్క ఛాన్స్ ప్లీజ్, గెలిచాక ఎక్స్ క్యూజ్ మీ అనడమే కాంగ్రెస్ పార్టీ ధోరణి అని, అలాంటి ఢిల్లీ నేతల హామీలు నమ్మితే తెలంగాణ మోసపోవడం ఖాయం అని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆరు నెలల క్రితం కర్నాటక ప్రజలకు సైతం ఈ కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపిందని తీరా అధికారంలోకి వచ్చాక ప్రజలను కాటేస్తోందన్నారు. కర్నాటక మోడల్‌ను తెలంగాణలో అమలు చేస్తామని వస్తున్న వారిని ప్రజలు నమ్మకూడదని కర్నాటకలో ఖజానా ఖాళీ అయి పలు సంక్షేమ పథకాలకు కోత పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలకు రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలే ప్రధాన ప్రధాన బాధితులన్నారు. కర్నాటకలో జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను రెచ్చగొట్టిన రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చాక ఆ రాష్ట్రానికి వెళ్లడం లేదని ధ్వజమెత్తారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచిన ఒక్క జాబ్ నోటిఫికేషన్ ఇవ్వలేదని వెన్నుపోటు పొడిచే కాంగ్రెస్ తెలంగాణకు అవసరమా అని ప్రశ్నించారు.


 అభివృద్ది నిధులు ఇవ్వకపోతే జనాల్లోకి ఎలా వెళ్ళాలని అక్కడి ఎమ్మెల్యేలు అడుగుతున్నారని.. వెలుగుల దీపావళి కావాలా? కర్ణాటక లాంటి చీకటి కావాలా? 
తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలన్నారు.  ఆరు నెలల్లో అక్కడ 357 మంది కర్ణాటక రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.  కానీ తెలంగాణ లో రైతు ఆత్మహత్యకు తగ్గాయన్నారు.  తెలంగాణలో మేము  రైతులం అని గర్వంగా చెప్పుకుంటున్నారన్నారు. కర్ణాటక   రాష్ట్రం పూర్తిగా దివాలా తీసిందని అక్కడ పరిపాలన పడకేసింది, అభివృద్ధి ఆగిపోయింది, సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ సమాధి కట్టిందని ఆరోపించారు. ఆరు నెలల క్రితం చేసిన తప్పుకు కర్నాటక ప్రజలు అనుక్షణం బాధపడుతున్నారు. ఈ బాధ తెలంగాణ ప్రజలకు రాకూడదనేది మా ప్రయత్నం అన్నారు.


కర్నాటక ప్రజల పరిస్థితి మబ్బులను చూసి కుండల్లో ఉన్న నీళ్లను వొలకబోసిట్లుగా మారిందన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే వన్స్ ఛాన్స్ అనే వారికి బుద్ధి చెప్పాలే. తిరిగి కేసీఆర్ కే పట్టాం కట్టాలని పిలుపునిచ్చారు. వెన్నుపోటు కాంగ్రెస్‌ను నమ్ముకుంటే.. తెలంగాణ ప్రజలకు గుండెపోటు తప్పదని హెచ్చరించారు. చిదంబరం వ్యాఖ్యలు చూస్తే కడుపులో చిచ్చు పెట్టి కండ్లు తుడవ వచ్చినట్లుగా ఉందని దుయ్యబట్టారు. అమరవీరుల తల్లిదండ్రులు కరడాలతో కొట్టినా మీ పాపం పోదు. చిదంబరం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.  చిదంబరం తీరు ఎలా ఉంది అంటే.... హిరోసిమా, నాగసాకి మీద అణుబాంబులు వేసిన అమెరికా సారి చెప్పినట్టు ఉంది. స్వాతంత్రం పోరాటంలో ఎంతో మందిని కాల్చి చంపిన డయ్యర్ సారి చెప్పినట్టు ఉంది.  ఆత్మబలిదానాలు చేసిన బిడ్డల తల్లిదండ్రులు కొరడాతో కొట్టినా కాంగ్రెస్ నాయకుల పాపం పోదన్నారు.