Telangana CM Revanth Reddy Singapore Tour : సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్నారు. విద్యార్థులు, యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు సంసిద్ధులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (Young India Skills University) ఆ దేశ ప్రభుత్వ ఆధీనంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ITE) సంస్థతో ఎంవోయూ కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ల సమక్షంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ మధ్య ఒప్పంద సంతకాలు జరిగాయి.
పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ పర్యటన
ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధికి విదేశీ పెట్టుబడులను సాధించడమే ఎజెండాగా సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం కావడానికి ముందుకొచ్చిన సింగపూర్ ప్రభుత్వంతో కీలకమైన ఒప్పందం కుదిరింది. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబులు ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ITES)ను సందర్శించారు. సింగపూర్ ఐటీఈలో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి సహా 20కి పైగా విభిన్న డొమైన్ల పనితీరును రేవంత్ రెడ్డి బృందం పరిశీలించింది. ఆయా రంగాలలో పనిచేస్తున్న నిపుణులు, సిబ్బందితో రేవంత్ రెడ్డి ముచ్చటించారు. తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఐటీఈ ప్రతినిధి బృందం త్వరలోనే హైదరాబాద్లో పర్యటించనుంది.
Also Read : Game Changer: 'గేమ్ చేంజర్' పైరసీ ప్రింట్ కేసులో అరెస్టులు... 'ఏపీ లోకల్ టీవీ' ఆఫీసుపై పోలీస్ రైడ్
యువతకు కావాల్సిన శిక్షణ
సింగపూర్ ఐటిఇ పదో తరగతి చదివే విద్యార్థుల స్థాయి నుంచి చదువు పూర్తి చేసిన యువత, ఆసక్తి ఉన్న ఏ వయసుల వారికైనా పరిశ్రమలు, ఐటి సంస్థల సహకారంతో జాబ్ కు సరిపోయే శిక్షణ అందిస్తుంది. ‘స్కిల్స్ ఫర్ ఫూచర్, స్కిల్స్ ఫర్ లైఫ్’ అనే నినాదంతో పనిచేస్తున్న ఐటిఇ లో ప్రస్తుతం 28 వేల మంది ట్రైనింగ్ తీసుకుంటారు. మొత్తం వంద ఫుల్ టైమ్ కోర్సులకు ఆన్లైన్, క్యాంపస్ ట్రైనింగ్ దొరుకుతుంది. ఐటిఇకి ఐదు వేల పరిశ్రమలతో పార్టనర్ షిప్ ఉంది. పరిశ్రమలు తమకు అవసరమైన మానవ వనరులకు నేరుగా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి. అదే స్పూర్తితో ఏర్పాటైన యుంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (yisu.in) తన శిక్షకులకు ఐటిఇ తో శిక్షణ ఇప్పించేలా ఒప్పందరం కుదుర్చుకుంది. తాజా ఎంఓయు వల్ల సింగపూర్ ఐటిఇ పాఠ్యాంశాలను (కరికులమ్) మనం కూడా ఉపయోగించుకునే వీలు కలుగుతుంది.
అపార అవకాశాలు
యువత సాంకేతిక నైపుణ్యాలు పెంచుకుని పరిగెడుతున్న ప్రపంచంతో పోటీ పడాలని, ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా నిపుణుల కొరత ఉందని, వృత్తి నైపుణ్యం లేకపోవడంతో నిరుద్యోగం పెరుగుతుందన్నారు. చాలా మందికి డిగ్రీ పట్టాలున్నా ఉద్యోగాలు దొరకడం లేదని ఆలోచించారు. అందుకే తెలంగాణ విద్యార్థులకు అన్ని రకాల నైపుణ్యాలను అందించి.. దేశానికి ఆదర్శంగా నిలిపేందుకు 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ' ఏర్పాటు చేస్తున్నామని గతంలో రేవంత్ రెడ్డి వెల్లడించారు.