Telangana Congress :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వేగం పెంచాలని నిర్ణయించుకుంది. 26వ తేదీన అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించిన తర్వాత పూర్తి స్థాయిలో ప్రచార బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే రాహుల్, ప్రియాంక గాంధీలు బస్సు యాత్ర నిర్వహించారు. కార్నర్ మీటింగ్‌లు , బహిరంగసభలు విజయవంతం కావడంతో  మరిన్ని సభలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నెల 31న కొల్లాపూర్‌లో ‘పాలమూరి ప్రజాభేరి’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. నవంబర్ మొదటి వారంలో రాహుల్ గాంధీ మరోమారు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాహుల్, ప్రియాంక రెండో విడత బస్సులో యాత్రలో పాల్గొననున్నారు. ఈ నెల 26 నుంచి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రేవంత్, కోమటిరెడ్డి, ఉత్తమ్ తోపాటు పార్టీ ఇంచార్జి థాక్రే కూడా ప్రజల్లోకి వెళ్లనున్నారు. రోజుకు రెండు నియోజకవర్గాల్లో వీరంతా పర్యటించనున్నారు.  


ఇంటింటి ప్రచారానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు                                   


ఈ నెల 26,27 తేదీ లలో కాంగ్రెస్ నేతలు ఇంటింటికి ప్రచారానికి వెళ్లనున్నారు. ఈనెల 26న ఉమ్మడి వరంగల్ ,ఉమ్మడి నల్లగొండ ,హైదరాబాద్ లలో , 27న ఉమ్మడి రంగారెడ్డి , ఆదిలాబాద్, కరీంనగర్ ,మెదక్, నిజామాబాద్ లలో పర్యటన లు ఉండనున్నాయి. రెండు రోజుల్లో 40 నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 10 మంది నేతలు రోజు కు రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.ఇంఛార్జి ఠాక్రే ,రేవంత్ రెడ్డి, భట్టి ,ఉత్తమ్ ,కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ ,శ్రీధర్ బాబు, మధుయాష్కీ, సీతక్క డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేయనున్నారు.


ప్రచార గడువు ముగిసే వరకూ అగ్రనేతల వరుస పర్యటనలు                             


రాహుల్, ప్రియాంక ఇద్దరూ పూర్తిస్థాయిలో తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని తమ భుజాల మీద వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి తోడు పోలింగ్‌ టైం దగ్గరపడుతున్నప్పుడు ఒక భారీ బహిరంగ సభ పెట్టి సోనియాను ఆహ్వానించాలని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒకసారి అధికారం ఇవ్వమని ఆమెతోనే అప్పీల్‌ చేయించాలన్న ప్లాన్‌ ఉన్నట్టు తెలిసింది. లోక్‌సభ ఎన్నికలు కూడా సమీపిస్తున్న టైంలో… తెలంగాణలో గెలిచి సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవడం చాలా అవసరం అని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. 


అభ్యర్థుల ఎంపికలో గెలుపు అవకాశమే మొదటి అర్హత           


అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజీ పడలేదు. గెలుపు గుర్రం అనుకున్న ప్రతి ఒక్కరికీ పిలిచి మరీ టిక్కెట్లు ఇచ్చింది. నియోజకవర్గాల్లో బలమైన నేతలు లేరు అనుకున్న చోట బీఆర్ఎస్ నేతలను పిలిచి మరీ టిక్కెట్లు ఇస్తోంది. రెండో విడత ప్రకటించబోయే జాబితాలో.. పది మందికిపైగా వలస నేతలు ఉంటారని చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేసిన వాళ్లే.