CM Revanth Reddy Tirumala Tour: తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) మంగళవారం తిరుమల (Tirumala) శ్రీవారి (Sri Venkateswara Swamy) దర్శనానికి వెళ్లనున్నారు. మనవడి తలనీలాలు సమర్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో సహా తిరుమల వెళ్లనున్నారు. నేటి నుంచే తిరుమలలో వీఐపీ దర్శనాలు ప్రారంభం అయ్యాయి. దీంతో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి నేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. రాత్రికి ఆయన తిరుపతిలోనే బస చేస్తారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి తిరుమలకు వెళ్తున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం బుధవారం ఉదయం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. అలాగే మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో పరిశ్రమల భవన్‌లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.  అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం తిరుపతికి పయనం కానున్నారు. 


నాలుగు గంటలపాటు మంత్రి వర్గ సమావేశం
సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో ఈ సమావేశం నిర్వహించారు. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో ధాన్యం సేకరణ, ఖరీఫ్ సాగు ప్రణాళిక, కాళేశ్వరం బ్యారేజీ మరమ్మతులు, విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలలు తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు.


ధాన్యం కొనుగోలు చేసే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు. రైతులు నష్టపోకుండా చివరి ధాన్యం వరకు కొనుగోలు చేయాలని సూచించారు. సన్నవాడ సాగు చేసిన రైతులకు క్వింటాల్‌కు 500 చొప్పున బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్‌ఎస్‌డీఏ ఇచ్చిన మధ్యంతర నివేదికపైనా కేబినెట్‌లో చర్చించారు. 


మీడియాకు వివరాలు చెప్పిన మంత్రి పొంగులేటి
ఈ సమావేశ వివరాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ఉత్సవాలకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో పాలు పలువురు కాంగ్రెస్ ప్రముఖులను ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే సీజన్‌ నుంచి సన్న వడ్లకు కనీస మద్దతు ధరపై రూ.500 బోనస్‌ ఇవ్వడంతో పాటు తడిసిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యాన్ని రైతుల వద్ద కొనాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.


అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా ప్రభుత్వ స్కూళ్లు నిర్వహించాలని నిర్ణయించామని, కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. వర్షా కాలంలో గేట్లు తెరిచే ఉంచాలని, చుక్క నీరు కూడా నిల్వ ఉంచొద్దని ఎన్‌డీఎస్‌ఏ సూచించిందని మంత్రి తెలిపారు. తాత్కాలిక మరమ్మతులు చేసినా రైతులకు నీరు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించిందని పొంగులేటి వెల్లడించారు.