Telangana CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఊపు మీద ఉన్న  కాంగ్రెస్‌ దృష్టి ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలపై పెట్టింది. 17 సీట్లకు గానీ కచ్చితంగా 12 ప్లస్‌ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకొని వ్యూహాలు రచిస్తోంది. ఈ మేరకు పీసీసీ చీఫ్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు. 


జిల్లా నేతలతో మంతనాలు 


సోమవారం సాయంత్ర ఎమ్మెల్యేలు, మంత్రుతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికలపై చర్చించారు. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో 12 ప్లస్‌ సీట్లు కైవశం చేసుకునేలా నేతలు పని చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఆ మేరకు శ్రేణులను సమాయత్తం చేయాలని అన్నారు. ముఖ్యంగా ఐదు జిల్లా నేతలతో సుదీర్ఘ మంతనాలు చేశారు. 


26 నుంచి జిల్లా పర్యటనలు 


ఆదిలాబాద్, మెదక్‌, హైదరాబాద్‌, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో సమావేశమైన రేవంత్ రెడ్డి టార్గెట్ ఫిక్స్ చేశారు. తాను కూడా 26 తర్వాత జిల్లా పర్యటనలకు వస్తానని పేర్కొన్నారు. తొలి పర్యటన ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలు కానుంది. 


తొలి సభ ఇంద్రవెల్లిలో


ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి బహిరంగ సభతో లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని రేవంత్ రెడ్డి స్టార్ట్ చేయనున్నారు. అక్కడే అమరవీరుల స్మారక స్మృతి వనం ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి పాల్గొనే తొలి బహిరంగ సభ ఇంద్రవెల్లి సభే అవుతుంది. అందుకే నేతలు కూడా విస్తృత ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. 


ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండేలా చర్యలు 


గత ప్రభుత్వంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కచ్చితంగా ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండేలా తన షెడ్యూల్‌ను మార్చుకున్నారు. జనవరి 26 తర్వాత ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని నేతలు చెప్పారు. వారాికి మూడు రోజుల పాటు ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండబోతున్నట్టు తెలిపారు. సాయంత్ర నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఎమ్మెల్యేతో సమావేశమై వారి సమస్యలు, వారి నియోజకవర్గ సమస్యలు తెలుసుకుంటానని రేవంత్ వివరించారు.