Indhiramma Houses: తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వం ప్రతి‌ష్టాత్మకంగా  చేపట్టనున్న పేదలకు ఉచిత ఇళ్ల నిర్మాణంపై కసరత్తు ప్రారంభించింది. ఇందిరమ్మ ఇళ్లు(Indhiramma Houses) పేరిట పేదలందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్(Congress) హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించేలా లేకపోవడంతో  కేంద్రం నుంచి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. అందుకు అనుగుణంగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోచన పథకం(PMAY) ద్వారా అందించే సాయం వీలైనంత ఎక్కువ తీసుకోవాలని నిర్ణయించింది. అందుకోసం కేంద్రం విధించిన నిబంధనలు తూ.చ. తప్పకుండా పాటించాలని భావిస్తోంది.


కేంద్రం సాయం తప్పనిసరి
పేదల ఇళ్లపథకం కోసం కేంద్ర నిధులు వినియోగించుకోవాలని యోచిస్తున్న తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వం ..ఆ మేరకు కేంద్రం విధించే నిబంధనలన్నీ పాటించేందుకు అంగీకారం తెలిపింది. ఇదే విషయాన్ని అధిష్టానానికి సైతం సూచించింది. ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలంటే  ఇళ్ల నిర్మాణానికి పెద్దఎత్తున ఖర్చు చేయాల్సి  ఉంటుందని...రాష్ట్ర ఖజానాపై భారంపడే అవకాశం ఉండటంతో కేంద్రం నుంచి సాయం కోరుతున్నట్లు  వెల్లడించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోచన పథకం(PMAY) కేంద్రం  ఇళ్ల నిర్మాణానికి పెద్దఎత్తున సాయం చేస్తోంది. సాధ్యమైనంత వరకు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సర్కార్ భావిస్తోంది. పీఎంఏవై  నిబంధనలు పాటించడమేగాక...ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన సమగ్ర సమాచారం కేంద్రానికి అందించేందుకు సిద్ధమైంది. కేంద్రం సాయంతో  రాష్ట్రాంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కొనసాగించాలని భావిస్తోంది. దీంతో కేంద్రం విధించే మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చింది. దీని ద్వారా వీలైనంత ఎక్కువమందికి లబ్ధి చేకూర్చడమే గాక..భారీగా నిధులు రాబట్టాలని తెలంగాణ(Telangana) ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర నిబంధనలు అనుసరించి మిగిలిన రాష్ట్రాలు ఈ పథకాన్ని ఏ విధంగా పాటిస్తున్నాయో అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.


పీఎంఏవై యాప్‌
ప్రధానమంత్రి ఆవాస్ యోచన పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది ఇళ్ల నిర్మాణానికి కేంద్రం  శ్రీకారం చుట్టింది. దీనికోసం ప్రత్యేకంగా ఓయాప్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన వివరాన్నీ ఈ యాప్‌(APP)లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఐదేళ్లలో ఎన్ని ఇల్లు నిర్మిస్తారు. ఎక్కడెక్కడ నిర్మిస్తారు.. ఒక్కో ఇంటికి అయ్యే ఖర్చు, లబ్ధిదారుల పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. లబ్ధిదారులు ఖచ్చింతంగా ఇల్లు లేనివారై ఉండాలి, అలాగే తెల్లరేషన్ కార్డు(White Ration Card)దారులై ఉండాలి. ఖచ్చితంగా లబ్ధిదారుడు అదే గ్రామానికి చెందినవాడై ఉండాలి. ఇలా అన్నిరకాల నిబంధనలు పాటిస్తేనే కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది. ఒకవేళ రాష్ట్రం పంపిన వివరాలు సరిచూసుకునేందుకు  కేంద్రం కూడా తనిఖీ చేసే వీలుంటుంది. నిబంధనలు పాటించకుండా తప్పుడు సమాచారం ఇస్తే...మొత్తం నిధులు నిలిపివేసే అవకాశం కూడా ఉంది.


మూలనపడిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లు
బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం ఆశించిన మేర విజయం సాధించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఇళ్ల నిర్మాణం చేపట్టినా....అసంపూర్తిగానే నిలిచిపోయాయి. ఒకటీ, అరా తప్ప...చాలా చోట్ల ఈ ఇళ్ల నిర్మాణం పూర్తికాలేదు. దీనికి కారణాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆరా తీసింది. పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం సాయం చేయాలంటే ముందుగా లబ్ధిదారుల ఎంపిక జరగాలి. కానీ అప్పుటి కేసీఆర్(KCR) సర్కార్ ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టానుసారం ముందుగా ఇళ్ల నిర్మాణం చేపట్టింది. దాదాపు ఇళ్లు పూర్తయిన తర్వాత కూడా  లబ్ధిదారుల జాబితా రూపొందించకపోవడంతో  కేంద్రం తప్పుబట్టింది. దీంతో ఈ పథకానికి పీఎంఏవై (PMAY)సాయం అందించేందుకు నిరాకరించింది. దీంతో అప్పటి ప్రభుత్వం దాదాపు 1200 కోట్ల రూపాయల సాయం కోల్పోయింది. దీంతో నిధులు సర్దుబాటుగాక...రెండు పడక గదుల  ఇళ్ల నిర్మాణాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు తీసుకు వెళ్లలేకపోయింది.  
ఇలాంటి పరిస్థితి రాకుండా రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ముందుగానే అన్ని నిబంధనల మేరకు నడుచుకోవాలని భావిస్తున్నారు. ఐదేళ్లలోనే 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆయన...ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా ఈ పథకం సాగిపోవడానికి ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకుంటున్నారు.