Telangana CM Revanth Reddy: మహదేవపూర్‌: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చుపెట్టినా.. లక్ష ఎకరాలకు కూడా నీరు అందించలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో దెబ్బతిన్న పిల్లర్లను, ప్రాజెక్టును మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీల బృందం పరిశీలించింది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులపై రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. గతేడాది అక్టోబరు 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని ఇన్‌ఛార్జి చీఫ్‌ ఇంజినీర్‌ సుధాకర్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు.


కోటి ఎకరాలకు నీరు నిజం కాదు.. 
సమీక్ష, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తరువాత సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు రూపాయలు ఖర్చుపెట్టినా.. కనీసం లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదని ఆరోపించారు. కానీ మాజీ సీఎం కేసీఆర్‌ మాత్రం కోటి ఎకరాలకు నీరు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ చెప్పినా.. కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదన్నారు. సమస్య తెలిసినా, చక్కదిద్దే ప్రయత్నం చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ప్రాజెక్టు ద్వారా సాగునీరు వచ్చిందో లేదో కానీ, ఏటా విద్యుత్‌ బిల్లులే రూ.10,500 కోట్లు వస్తున్నాయని సెటైర్లు వేశారు. ప్రాజెక్టు సంబంధిత రుణాలు, ఇతర ఖర్చులతో కాళేశ్వరానికి ఏటా రూ.25వేల కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. 


ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డకు సీఎం, ప్రజాప్రతినిధుల టీమ్ 
మంగళవారం (ఫిబ్రవరి 13న) ఉదయం అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల, అధికారుల బృందం మేడిగడ్డకు ప్రత్యేక బస్సుల్లో వెళ్లారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్లను పరిశీలించారు. పిల్లర్లు కుంగిపోవడంతో మేడిగడ్డను ఎవరూ చూడకుండా కేసీఆర్‌ కప్పిపుచ్చారని.. చివరికి ఈసీ అనుమతి తీసుకుని రాహుల్ గాంధీ, తాను మేడిగడ్డ బ్యారేజీ పరిశీలించినట్లు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వహణలోనూ లోపాలు ఉన్నాయని విజిలెన్స్ కమిటీ చెప్పిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన లోపాలపై తమ ప్రభుత్వం ఏర్పాటకయ్యాక మంత్రి విచారణకు ఆదేశించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. రీడిజైన్‌ పేరుతో భారీగా అవినీతికి పాల్పడ్డారని, రాష్ట్ర ప్రజలకు ఈ విషయాన్ని చూపించేందుకు తాము మేడిగడ్డ పరిశీలనకు రాగా, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని కేసీఆర్ మాత్రం నల్లగొడలో సభ పెట్టారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌కు రెండు పర్యాయలు ప్రజలు అవకాశం ఇస్తే కాళేశ్వరం పేరుతో భారీగా దోచుకున్నారంటూ మండిపడ్డారు. 


2020లోనే నాణ్యతా లోపం.. 
కోటి ఎకరాల మాగాణికి నీళ్లు ఇచ్చామన్న కేసీఆర్ వ్యాఖ్యలు పచ్చి అబద్దం అని, కాళేశ్వరం ఆయకట్టు కెపాసిటీ ఇప్పటివరకు 95 వేల ఎకరాలు అని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టును దశలవారీగా పెంచితే మొత్తం 13 లక్షల ఎకరాలు మాత్రమే నీళ్లు ఇవ్వగలం అని.. ఇప్పటి వరకు 94వేల కోట్లు ఖర్చు అయ్యిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అంచనా 1 కోటి 27 వేల లక్షల కోట్లు. కాళేశ్వరం ద్వారా గరిష్టంగా 19,63,000 ఎకరాలకు నీరు అందివ్వగలం అని తెలిపారు. మేడిగడ్డలో 85 పిల్లర్స్, 7 బ్లాక్ లో పిల్లర్స్ కుంగాయన్నారు. 2020లోనే నాణ్యతా లోపం ఉందని ఇరిగేషన్ అధికారులు గుర్తించి ఎల్ అండ్ టీ కి లేఖ రాసినా పట్టించుకోలేదన్నారు. 


డిజైన్, నిర్వహణ, కాంట్రాక్ట్ పనుల్లో నాణ్యత లోపం ఉందని డ్యాం సేఫ్టీ అథారిటీ చెప్పిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. 2023 అక్టోబర్ లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు వచ్చి పరిశీలించి లోపం ఉన్నట్లు చెప్పి, ఆరు రకాల టెస్టులకు సూచించినా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు మేడిగడ్డ కుంగిపోగా, సుందిల్లా, అన్నారంలలో చుక్క నీరు లేదన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ అని చెబుతున్నా.. ఐదేళ్లలో 162 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి ఏడాది 180 టీఎంసీలు లిఫ్ట్ చేస్తామని కేసీఆర్ చెప్పారనీ.. గత ఏడాది కేవలం 8 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేశారని ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు.