Telangana CM Revanth Reddy : హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు ఎమ్మెస్పీకి అదనంగా ఒక్కో క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లిస్తుందని ఆయన స్పష్టం చేశారు. గత సీజన్ లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు 3 రోజుల్లో డబ్బులు ఇచ్చామని, ఇప్పుడు 48 గంటల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. 


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ కాన్ఫరెన్స్ లో జిల్లాల నుంచి మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి (Shanti Kumari), సివిల్​సప్లయిస్​ఎండీ డీఎస్​చౌహన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్​రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 


ధాన్యం కొనుగోళ్లకు కొనుగోలు కేంద్రాలు


ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు 7 వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు నెలకొల్పినట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే గుర్తించిన కేంద్రాలతోపాటు ఎక్కడైనా అవసరమని కలెక్టర్లు భావిస్తే అక్కడ కొత్త కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ వానాకాలంలో  రాష్ట్రంలో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందన్నారు.


తొలిసారి సన్న వడ్లకు బోనస్
సన్న వడ్లకు బోనస్ ఇవ్వటం ఇదే మొదటిసారి కనుక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఎక్కడా ఎలాంటి తప్పుడు జరగకూడదన్నారు.సన్నవడ్ల సేకరణకు వీలుగా వేర్వేరు కొనుగోలు కేంద్రాలు  ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. లేకపోతే కొనుగోలు కేంద్రాల్లో వేర్వేరు కాంటాలు ఉండేలా చూడాలన్నారు. సన్న వడ్లు కొనేటప్పుడు నిర్దేశించిన ప్రమాణాలు పాటించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. సన్న రకాలను ధ్రువీకరించే యంత్రాలు, సిబ్బందిని అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. అప్రమత్తంగా లేకపోతే గోల్​మాల్​ జరిగే  ప్రమాదముందని అధికారులను హెచ్చరించారు.



ప్రతి కేంద్రానికి ఒక నెంబర్ కేటాయించాలని, కొనుగోలు చేసిన వడ్ల సంచులపైన నెంబర్ తప్పకుండా వేయాలన్నారు.  దీంతో ఏ దశలో గోల్​ మాల్​ జరిగినా ఎక్కడ జరిగిందో సులభంగా తెలుసుకునే వీలుంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా కట్టడి చేయాలని అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని మార్గాల్లోనూ పకడ్బందీగా నిఘా ఉంచాలని, చెక్ పోస్టుల వద్ద నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు 


తాలు ,తరుగు, తేమ పేరు తో రైతులను మోసం చేసే వారిపై అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాలని సీఎం రేవంత్ సూచించారు. రైతులు దోపిడీకి గురి కాకూడదని, అన్నదాతల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును కలెక్టర్లు స్వీకరించాలన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో సరిపడే సంఖ్యలో గోనె సంచులు, డ్రైయర్లు, ప్యాడీ క్లీనర్లు, టార్ఫాలిన్లు, మాయిశ్చర్ మిషన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంట వెంటనే తరలించేందుకు తగిన రవాణా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వాతావరణ సమాచారం అందిస్తూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి రోజు తమ జిల్లాలో జరుగుతున్న కొనుగోళ్ల ప్రక్రియను కలెక్టర్లు సమీక్షించాలని, నేరుగా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి కేంద్రాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు.ధాన్యం కొనుగోళ్లకు సమస్యలుంటే అదే రోజు పరిష్కరించాలని, సివిల్ సప్లయిస్ విభాగంలో 24X7 కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. 
Also Read: Nagarjuna Defamation: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన నాగార్జున, ఏం డిమాండ్ చేశారంటే!


58 శాతం సన్న వడ్లు, వచ్చే ఏడాది మరింత దిగుబడి
ఈ ఏడాది రాష్ట్రంలో వరి సాగులో 58 శాతం సన్న రకాలు సాగయ్యాయి. వచ్చే ఏడాది నుంచి సన్న వడ్లు దిగుబడి మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రమంగా రాష్ట్రంలో 100 శాతం సన్న వడ్లు పండించే రోజులు వస్తాయన్నారు. దొడ్డు వడ్లకు మార్కెట్లో డిమాండ్ లేదన్నారు. FCI వద్ద కూడా భారీగా నిల్వలున్నాయని, అందుకే సన్న వరి సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. వచ్చే ఏడాది నుంచి రేషన్ షాపు (Ration Shop)ల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు.  


ఈసారి 146 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో ట్రేడర్లు, మిల్లర్లు, కొనుగోలు చేసే ధాన్యం, రైతులు అవసరాలకు ఉంచుకునే ధాన్యం మినహాయిస్తే.. 91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అందులో 47 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకాలు, 44 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ఉంటాయని చెప్పారు. గతంలో వరుసగా బకాయి పడ్డ డిఫాల్టర్ మిల్లర్లకు ధాన్యం ఇవ్వొద్దని, మిగతా మిల్లర్లకు కూడా బ్యాంకు గ్యారంటీ తీసుకొని ఇవ్వాలని సూచించారు.