తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయి, నిరుద్యోగుల సమస్యకు ఏమైనా పరిష్కారం దొరుకుతుందా అనే అంశాలపై తాజాగా క్లారిటీ వచ్చింది. తెలంగాణ అసెంబ్లీలో మల్లు భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు సమాధానమంటూ సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. 2, 3 నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభంకానుందని అసెంబ్లీలో తెలిపారు. దసరా తర్వాత ఉద్యోగులతో చర్చలు నిర్వహిస్తామన్నారు. జోనల్‌ విధానం ప్రకారం ఉద్యోగుల విభజన ఉంటుందన్నారు. 


ప్రైవేట్ టీచర్లను ఆదుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేశామని కేసీఆర్ గుర్తుచేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం 30 శాతం పీఆర్సీ పెంచామని చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదన్నారు. భట్టి విక్రమార్క ఉద్యోగాల భర్తీపై అడిగిన దానికి సమాధానం చెబుతూ తెలంగాణ ఏర్పాటయ్యాక మొత్తంగా ఒక లక్షా యాభై ఒక వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పారు. ఇప్పటివరకూ 1.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని.. ఎవరికీ ఏ డిపార్ట్ మెంట్‌లో ఉద్యోగాలు వచ్చాయో అందరికీ తెలిసేలా చేస్తామన్నారు. అందుకోసం ఉద్యోగుల వివరాలను అవసరమైతే పెన్ డ్రైవ్ ద్వారా ఇస్తామని తెలిపారు.


Also Read: 100 నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు... 2, 3 నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ... అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు


‘రాష్ట్రం ఏర్పాటయ్యాక పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం. కేంద్రం మాత్రం మా ప్రతిపాదనలపై ఏడు నెలల సమయం తీసుకుంది. జిల్లాలు ఆలస్యమైతే మనకే నష్టం. దేశంలో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ మినహా ఇతర రాష్ట్రాలు జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాయి. 590కి పైగా మండలాలను పెంచాం. పోలీస్ కమిషనరేట్లు కూడా పెంచాం. గతంలో ఏం జరిగిందో భగవంతుడికి తెలుసు. తప్పని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని సాధించుకున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఘనత ఏంటంటే 95 శాతం ఉద్యోగాలు స్థానికులకు మాత్రమే ఇస్తున్నామని’ కేసీఆర్ వివరించారు.


Also Read: హుజూరాబాద్‌లో గెలిచేది ఈటలనే.. ఆ పార్టీతో కచ్చితంగా గులాబీ నేతల పొత్తు.. టీఆర్ఎస్ మాజీ ఎంపీ వ్యాఖ్యలు


3 చెరువుల నీళ్లు తాగాను.. 
మా రాష్ట్రంలో 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వేషన్లతో వస్తాయి. ఇవన్నీ స్థానికులకు అంటే తెలంగాణ వారికే వచ్చేలా చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అతికష్టమ్మీద సాధించాను. ఇందుకుకోసం తాను మూడు చెరువల నీళ్లు తాగాల్సి వచ్చిందన్నారు. జోనల్ విధానం ద్వారా అన్ని జిల్లాల్లో స్థానికులకు ఉద్యోగులు దక్కుతాయి. దసరా పండుగ అయిపోతే ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని చెప్పారు. సీఎస్, ఉన్నతాధికారులతో చర్చించి నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. కొందరు ములుగు, భూపాళపల్లి లాంటి ప్రాంతాలకు ఉద్యోగాలు వచ్చినా వెళ్లకపోయేవారు. కానీ ఇప్పుడు స్థానికులకు ఉద్యోగులు ఇస్తున్నాం కనుక ఆ సమస్య తీరుతుందన్నారు. దాదాపు 80వేల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశముందని ఆయన వెల్లడించారు.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి