6 Guarantees of Congress in Telangana:


రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల మధ్య ఆరోపణలు, విమర్శల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇచ్చిన 6 గ్యారంటీలు చూసి సీఎం కేసీఆర్ కు చలి జ్వరం పట్టుకుందని, ఆయన కొడుకు మంత్రి కేటీఆర్ అయితే మతి తప్పి మాట్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్ రేంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికలకు నిధుల కోసం కర్ణాటకలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ట్యాక్స్ వసూలు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో తెలంగాణలో అధికారంలోకి వస్తుందని, కానీ తాము ఇచ్చిన గ్యారంటీలు చూసి కేసీఆర్ చలి జ్వరం తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి కేటీఆర్ మతి తప్పిన మాటలు మాట్లాడుతున్నారంటూ చురకలు అంటించారు.


బీఆర్ఎస్ పాలన నిండా అవినీతిలో మునిగి, నిద్రలో కూడా కమీషన్ల గురించే కలవరించే మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడేది? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పక్క రాష్ట్రం (కాంగ్రెస్)పై నీ గాలి మాటలను కాసేపు పక్కనబెట్టి, తెలంగాణలో మీ కల్వకుంట్ల SCAMILY గురించి చెప్పు అని కేటీఆర్ కు కౌంటర్ ఇస్తూ రేవంత్ రెడ్డి ట్విట్టర్ (X)లో పోస్ట్ చేశారు. దళిత బంధులో  30 శాతం కమీషన్లు దండుకుంటున్నమని స్వయంగా కేసీఆర్ ఒప్పుకున్న సంగతి గురించి చెప్పు. లిక్కర్ స్కామ్ లో మీ చెల్లి రూ.300 కోట్లు వెనకేసిందని దేశమంతా చెప్పుకుంటున్న మాటల గురించి చెప్పు.. భూములు, లిక్కర్ అమ్మితే తప్ప తెలంగాణలో పాలన నడుస్తలేదని కాగ్ కడిగేసిన విషయం గురించి చెప్పు అంటూ ఘాటుగా స్పందించారు రేవంత్.


తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ భూములను అమ్ముకున్నరో. ఎన్నిఎకరాలను మీ రియల్ ఎస్టేట్ మాఫియాకు కట్టబెట్టిండ్రో. ఎంత మంది మీ బినామీ బిల్డర్లతో హైదరాబాద్ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నరో అన్నారు. ఎన్ని లక్షల చ. అడుగుల స్థలాలు మీ మాఫియా కబంధ హస్తాల్లో చిక్కుకున్నయో.. అన్నీ లెక్కలతో సహా తేలుస్తాం. కాంగ్రెస్ దూకుడును అడ్డుకోవడం నీ వల్ల కాదు.. నీ అయ్య వల్ల కూడా కాదు అని రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు.




ఇంతకీ కేటీఆర్ ఏమన్నారంటే.. 
కర్ణాటకలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీకి నిధులు ఇవ్వడానికి "రాజకీయ ఎన్నికల పన్ను" విధించడం ప్రారంభించిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బెంగళూరులో బిల్డర్లకు చదరపు అడుగుకి 500  చొప్పున పన్ను వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. మీ పాత అవాటు ఎన్నటికీ మార్చుకోరు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ తన స్కామ్ ల వారసత్వాన్ని కొనసాగిస్తుందని కనుక ఆ పార్టీని అంతా స్కామ్‌గ్రెస్ అని పిలుస్తారంటూ కాంగ్రెస్ నేతల్ని కవ్విస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎన్నికల కోసం ఎంత డబ్బు ముట్టజెప్పినా తెలంగాణ ప్రజలను ఎవరూ మోసం చేయలేరు.. స్కామ్‌గ్రెస్ కు నో చెప్పాలంటూ కేటీఆర్ పోస్ట్ చేయడంతో వివాదం మొలైంది.